పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లు బోధించే ఉపాధ్యాయుడికన్నా.. సరదాగా..ఆటపాటలతో పరిసరాలతో మమేకమయ్యేలా బోధించే టీచర్ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతారు. వాళ్లు చెప్పే పాఠాలను విద్యార్థులు జీవితంలో మరిచిపోలేరు. టర్కీలో ఓ టీచర్ విద్యార్థులను ఆకట్టుకునేందుకు నిర్వహించిన ఓ ప్రయోగం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసినవారంతా ఈ టీచర్ను మెచ్చుకుంటున్నారు.
టీచర్ క్లాస్రూంలో ఓ బాక్స్ ఏర్పాటుచేశాడు. అందులో తనకిష్టమైన విద్యార్థి ఉన్నాడని చెప్పి, ఒక్కో విద్యార్థిని చూసిరావాల్సిందిగా కోరాడు. దీంతో చిన్నారులు ఒకరివెనుక ఒకరు వచ్చి ఆ బాక్సులో చూస్తూ మురిసిపోయారు. బాక్సులో తొంగి చూడగానే వారి మొహాల్లో నవ్వులు విరబూసాయి. కాగా, ఆ టీచర్ బాక్సులో ఓ అద్దాన్ని అమర్చాడు. అందులో ఏ విద్యార్థి చూస్తే ఆ విద్యార్థి ముఖం కనిపించే సరికి వారు మురిసిపోయారు. ఈ వీడియోను ట్రోల్ అగ్రెట్మెన్ అనే యూజర్ ఇన్స్టాలో పోస్ట్చేయగా వైరల్గా మారింది. ఇలాంటి ప్రయోగాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని, ఆ ఉపాధ్యాయుడు చాలా తెలివిగా ఆలోచించాడని నెటిజన్లు ప్రశంసించారు.