లక్నో: బీజేపీ ఎమ్మెల్యేపై స్థానిక మహిళలు బురద చల్లారు. బకెట్లతో బురద నీళ్లను తలపై గుమ్మరించారు. బురద నీళ్లతో తల స్నానం చేయించారు. ఉత్తర ప్రదేశ్లోని మహరాజ్గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిపర్డ్యూరా ప్రాంతానికి చెందిన మహిళలు వాన దేవుడి ప్రసన్నం కోసం పురాతన ఆచారాన్ని పాటిస్తుంటారు. ఇందులో భాగంగా స్థానిక పాలకులకు బురద నీళ్లతో తల స్నానం చేయించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ ప్రాంత మహిళలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ల తలపై బురద నీళ్లు గుమ్మరించి మట్టి స్నానం చేయించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సంప్రదాయ పాటలు పాడారు.
కాగా, పిల్లలు, పెద్దలు బురద నీటితో తల స్నానం చేయడం వల్ల వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత మహిళల నమ్మకమని బీజేపీ ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ తెలిపారు. పురాతన సంప్రదాయమైన ఈ బురద స్నానంలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Women in Pipardeura area of Maharajganj in Uttar Pradesh throw mud at MLA believing this will bring a good spell of rainfall for the season pic.twitter.com/BMFLHDgYxb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 13, 2022