అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో కలకలం రేపింది. అంతరిక్ష వ్యర్థాలు పలు ప్రాంతాల్లో పడ్డాయి. ఆనంద్ జిల్లాలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. భలేజ్, ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో ఆకాశం నుంచి మిస్టీరియస్ శిథిలాలు రాలి పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. భలేజ్ ప్రాంతాలో గురువారం సాయంత్రం 4.45 గంటలకు ఐదు కేజీల బరువున్న నల్ల రంగులోని మెటల్ బాల్ పడింది. ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో కూడా ఇలాంటివి ఆకాశం నుంచి పడ్డాయి. ఈ మూడు గ్రామాలు 15 కిలోమీటర్ల పరిధిలో పక్కపక్కనే ఉన్నాయి.
మరోవైపు ఆందోళన చెందిన గ్రామస్తులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆకాశం నుంచి రాలిపడిన శిథిలాలను పోలీసులు పరిశీలించారు. శాటిలైట్ వ్యర్థాలుగా వారు బావించారు. వీటి వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని ఆనంద్ జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ తెలిపారు. ఖంభోల్జ్ లో ఒక ఇంటికి సమీపంలో, మరో రెండు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆకాశం నుంచి వ్యర్థాలు పడినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిపుణులను పిలిపించినట్లు వెల్లడించారు.