లక్నో : మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు తీవ్రంగా కొట్టి జై శ్రీరాం అనాలని వేధింపులకు గురిచేసి ఘటన యూపీలోని బులంద్షహర్లో వెలుగుచూసింది. మొత్తం ఘటనను వీడియోలో రికార్డు చేయడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 13న ఈ ఘటన జరగ్గా బాధిత కుటుంబసభ్యులు ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో శనివారం నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు సాహిల్ కకొడ్ గ్రామ బస్స్టాండ్లో నిల్చునిఉండగా ముగ్గురు యువకులు అక్కడకు వచ్చి బలవంతంగా అతడిని బైక్పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. మొబైల్ చోరీ చేశావని ప్రశ్నిస్తూ అతడిని చెట్టుకు కట్టేసి కొడుతూ తల వెంట్రుకలు తొలగించి ఆపై జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేశారు.
ఈ ఘటనను మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేశారు. ఆపై బాధితుడు ఎలాగోలా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు తనపై మొబైల్ చోరీ ఆరోపణలు మోపి అరెస్ట్ చేశారని బాధితుడు వాపోయారు. జూన్ 17న బాధితుడి తల్లితండ్రులు ఏఎస్పీని కలిసి ఘటన వీడియోను అందచేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Read More :
Aadhar Update | ఆధార్ నవీకరణ గడువు పొడిగింపు.. సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించిన యూఐడీఏఐ