చాలా మందికి పెంపుడు జంతువులంటే ఇష్టం ఉంటుంది. కొందరికి వాటితో గడపకుంటే రోజు పూర్తవదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మహిళకు తన పెంపుడు పిల్లి అంటే అంతకుమించి ప్రేమ. ఎంతలా అంటే.. పెళ్లి చేసుకునేంత. నిజమేనండీ.. బ్రిటన్ రాజధాని లండన్కు చెందిన 49 ఏళ్ల డెబోరా హాడ్జ్ అనే మహిళ ఒక పిల్లిని పెంచుకుంటోంది.
ఆ పిల్లి పేరు ఇండియా. కానీ ఈ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో పెంపుడు జంతువులకు అనుమతి లభించదు. దీంతో ఆ ఇళ్లలో చేరే వాళ్లు తమ పెంపుడు జంతువులను వదిలేయాల్సి వస్తోంది. లేదంటే వాళ్లకు అద్దె ఇళ్లు దొరకడమే కష్టంగా మారుతోంది. ఈ నిబంధనలు తనకు అస్సలు నచ్చలేదని డెబోరా చెప్పింది.
అంతకుముందు కూడా కొన్నిసార్లు ఇలాంటి నిబంధనల వల్ల తన పెంపుడు జంతువులను వదిలేయాల్సి వచ్చిందని, తన ఇండియా విషయంలో అలా చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపింది. అందుకే ఆగ్నేయ లండన్లోని ఒక పార్కులో తన పిల్లి పిల్లను ఈ ఇద్దరు పిల్లల తల్లి పెళ్లి చేసుకుంది.
‘‘ఇండియాను పెళ్లి చేసుకోవడం ద్వారా మేమందరం ఇక ప్యాకేజిగా వస్తామని, మమ్మల్ని విడదీయడం కుదరదని చెప్పదలచుకున్నా. నా పిల్లలు ఎంత ముఖ్యమో ఇండియా కూడా నాకు అంతే ముఖ్యం’’ అని చెప్పింది. తన పిల్లి పిల్లకు దూరం కావడం కంటే రోడ్డు మీద బతకడానికే తాను ఇష్టపడతానని డెబోరా స్పష్టం చేసింది. ప్రస్తుతం డెబోరా చేసిన పని నెట్టింట వైరల్గా మారింది.