హైదరాబాద్: హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈ మధ్యాహ్నం కలకలం చెలరేగింది. ఓ యువకుడు సింహాల ఎన్క్లోజర్లోకి దిగే ప్రయత్నం చేశాడు. ఇంతలో జూ సిబ్బంది అప్రమత్తమై యువకుడిని రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రగడ్డకు చెందిన సాయికుమార్ ఓ హోటల్లో హెల్పర్గా పనిచేస్తుంటాడు. మంగళవారం జూపార్కును సందర్శించేందుకు వెళ్లాడు. అక్కడ జంతువులను చూస్తూ సింహాల ఎన్క్లోజర్ దగ్గరకు చేరుకున్నాడు.
అయితే, అందరిలా దూరం నుంచి సింహాలను వీక్షించకుండా ఎన్క్లోజర్ చుట్టూ నిర్మించిన ప్రహరిపైకి ఎక్కాడు. ప్రహరిపై నుంచి సింహాలను చూస్తూ వాటి ముందు దిగే ప్రయత్నం చేశాడు. అది చూసి తోటి సందర్శకులు కేకలు వేయడంతో అప్రమత్తమైన జూ సిబ్బంది వెంటనే ఆ యువకుడిని రక్షించి తీసుకొచ్చారు. అనంతరం అతడిని బహదూర్పురా పోలీసులకు అప్పగించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో యువకుడు సాయికుమార్కు మతిస్థిమితం లేదని వెల్లడైంది.
కాగా, జూ సిబ్బంది నిర్లక్ష్యంవల్లే సాయికుమార్ సింహాల సమీపం వరకు వెళ్లగలిగాడని సందర్శకులు విమర్శించారు. వందల మంది సందర్శకులు జంతువులను వీక్షిస్తుంటే క్రూరమృగాల ఎన్క్లోజర్ దగ్గర గార్డు లేకపోవడం దారుణమని మండిపడుతున్నారు. కాగా, ఎన్క్లోజర్ చుట్టూ ఫెన్సింగ్ ఉన్నా యువకుడు లోపలికి ఎలా వెళ్లగలిగాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదిలావుంటే.. సింహాల దగ్గర బంగారం, రత్నాలు ఉంటాయని, అందుకోసమే తాను సింహాల దగ్గరికి వెళ్లానని సాయికుమార్ పిచ్చిపిచ్చిగా అరిచినట్లు సందర్శకుల్లో కొందరు చెప్పారు. సాయికుమార్ ఎన్క్లోజర్ లోపలికి దిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఓ సింహం తల పైకెత్తి గాండ్రించిందని, అతడు దూకితే మింగేద్దామన్నట్టు ఆశగా ఎదురు చూసిందని సందర్శకులు తెలిపారు. కాగా, సాయికుమార్ సింహాల ఎన్క్లోజర్లోకి దిగేందుకు ప్రయత్నించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.