సెల్ఫీ తీసుకుంటూ ఎన్నో ప్రమాదాలకు గురయిన వాళ్లను ఇప్పటి వరకు చాలామందిని చూశాం. కొందరైతే తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఎత్తయిన కొండల మీది నుంచి, బిల్డింగ్ల మీది నుంచి, బ్రిడ్జ్ మీది నుంచి.. ఇలా.. సెల్ఫీ మీద ఉన్న మోజు.. ప్రాణాలనే తీస్తోంది కానీ.. జనాలు మాత్రం మారడం లేదు. సోషల్ మీడియాలో లైక్స్ కోసమో.. పాపులర్ అవ్వడం కోసమో రిస్క్ చేసి మరీ.. సెల్ఫీలు దిగుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లేదంటే.. గాయాలపాలు అవుతున్నారు.
తాజాగా చెన్నైలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి రాత్రిపూట ఓ నది దగ్గరికి వెళ్లాడు. అక్కడున్న బ్రిడ్జి మీదికి ఎక్కి.. సెల్ఫీ తీసుకోబోయాడు. అయితే.. సెల్ఫీ తీస్తుండగా.. మనోడి ఫోన్ చేతుల్లో నుంచి జారింది. దీంతో దాన్ని అందుకోవడం కోసం జంప్ చేశాడు. నేరుగా బ్రిడ్జి నుంచి కింద ఉన్న నదిలో పడిపోయాడు. పడగానే.. అక్కడ ఉన్న పిల్లర్ను పట్టుకొని రక్షించండి.. అంటూ అరవ సాగాడు. అది రాత్రి పూట కావడం.. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ వ్యక్తి ఆర్తనాదాలను పట్టించుకున్న నాథుడే లేడు. ఇక చేసేది లేక.. రాత్రి మొత్తం ఆ పిల్లర్నే పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఉదయం 6 గంటల సమయంలో వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్లు అతడిని గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతడిని తాడు వేసి పైకి లాగారు. అంత పైనుంచి కింద పడ్డా.. నీళ్లు ఉండటంతో ఆ వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదు. అలా.. రాత్రంతా నదిలో మనోడు జాగారం చేయాల్సి వచ్చింది.