భోపాల్: సాధారణంగా పక్షులు మనుషుల పరిసరాల్లోనే సంచరిస్తుంటాయి. కానీ మనిషి చేతికి మాత్రం అవి అంత ఈజీగా చిక్కువు. ఇండ్లలో మాంసం కోసం పెంచుకునే కోళ్లు, బాతులు, టర్కీ బర్డ్స్ సంగతి పక్కనబెడితే ఇతర పక్షులైన ఊరపిచ్చుకలు, రామ చిలుకలు, గోరింకలు, నెమళ్లు, కాకులు, కొంగలు, కోకిలలు అస్సలు దొరకవు. మన పట్టుకునే ప్రయత్నం చేస్తే చాలు అక్కడి నుంచి తుర్రుమని జారుకుంటాయి.
కానీ, మధ్యప్రదేశ్లో ఓ అడవి రామ చిలుక మాత్రం అలా తుర్రుమని జారుకునే పక్షి రకం కాదు. దారినపోయే బడి పిల్లలతో ఆ రామ చిలుక దోస్తీ చేస్తుంది. వారిపై భుజాలపై వాలి ముఖంలో ముఖం పెట్టి చూస్తుంది. వారి తలలపై వాలి ఆటపట్టిస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో శర్దా బాల్గ్రామ్ ఫారెస్ట్ ఉన్నది. ఆ ఫారెస్ట్ సమీపంలోనే ఒక పాఠశాల ఉన్నది. ప్రతిరోజూ ఆ పాఠశాలకు వచ్చిపోయే పిల్లలతో ఈ రామచిలుక మస్తు మజా చేస్తుంది.