జైపూర్: ఒక వ్యక్తి ఏకంగా 63 రూపాయి నాణేలు మింగాడు. దీంతో కడుపు నొప్పితో బాధ పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఎక్స్ రే తీసిన వైద్యులు ఆ వ్యక్తి కడుపులో పేరుకుపోయిన రూపాయి నాణేలను గుర్తించారు. రెండు రోజుల పాటు ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల వ్యక్తి తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో జూలై 25 నుంచి వరుసగా రెండు రోజుల పాటు రూపాయి నాణేలు మింగాడు. అనంతరం అతడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడగా కుటుంబ సభ్యులు జూలై 27న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్ రే తీసిన ఎండీఎం హాస్పిటల్ వైద్యులు, ఆ వ్యక్తి కడుపులో రూపాయి నాణేలు కుప్పగా ఉండటాన్ని గుర్తించారు.
కాగా, ఎండీఎం హాస్పిటల్ వైద్యులు సుదీర్ఘంగా రెండు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా ఆ వ్యక్తి కడుపులోని 63 రూపాయి నాణేలను బయటకు తీశారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా ఉన్నాడని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెడ్ డాక్టర్ నరేంద్ర భార్గవ్ తెలిపారు. తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆ వ్యక్తి రెండు రోజులపాటు రూపాయి నాణేలు మింగినట్లు చెప్పారు. అతడ్ని ప్రశ్నించగా 10-15 నాణేలు మాత్రమే మింగినట్లు చెప్పాడని, అయితే ఆ వ్యక్తి కడుపులో ఏకంగా రూపాయి నాణేలు 63 ఉన్నాయని వివరించారు. తీవ్ర మనోవేదనతో బాధపడుతున్న అతడికి మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వెల్లడించారు.