భోపాల్ : తనలాగా తన పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకోకూడదని వారి బాగు కోసం ఎంతైనా శ్రమిస్తుంటారు రైతులు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా అరందియా గ్రామానికి చెందిన రైతు కూడా పిల్లల కోసం ఏం చేసేందుకూ వెనకాడరు.
తన కొడుకు పెండ్లి కలకాలం గుర్తుండాలని రైతు ఏకంగా వివాహ వేడుక కోసం హెలికాఫ్టర్ను అద్దెకు తెప్పించాడు. కొత్త కోడలిని ఆకాశ మార్గంలో ఇంటికి తీసుకువచ్చేందుకు ఆయన లక్షలు వెచ్చించాడు. అరందియా నుంచి రాజస్ధాన్కు రైతు సజ్జన్ సింగ్ కుష్వాహ ఊరేగింపుగా పెండ్లి బృందంతో వెళ్లాడు.
పెండ్లి వేడుక ముగిశాక కొత్త కోడలు ఆమె తల్లితండ్రులను హెలికాఫ్టర్లో తమ ఇంటికి తీసుకువచ్చాడు. ప్రతి తండ్రి తన కుమారుడి పెండ్లికి మెరుగైన ఏర్పాట్లు చేస్తారని అయితే తన తండ్రి చేసిన వినూత్న ఏర్పాట్లను తాము ఊహించలేదని పెండ్లి కొడుకు జై సింగ్ కుష్వాహ చెప్పుకొచ్చాడు. తన జీవితంలోనే ఇది మరిచిపోలేని బహుమతి అన్నాడు.