మెల్బోర్న్ : కంపెనీ ఉద్యోగులందరినీ అన్ని ఖర్చులు భరించి రెండు వారాల పాటు ఇండోనేషియాలోని బాలి దీవులకి తీసుకెళ్లిన బాస్పై సిబ్బంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రపంచంలో ఉత్తమ బాస్ ఎవరంటే మా బాసే అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
సిడ్నీకి చెందిన మార్కెటింగ్ కంపెనీ సూప్ ఏజెన్సీస్ తమ ఉద్యోగులను రెండు వారాల పాటు ఇండోనేషియా దీవులకు తీసుకువెళ్లడంతో ఉద్యోగులు ఖుషీ అయ్యారు. ఉద్యోగులు బాలి దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను కంపెనీ తన ఇన్స్టాగ్రాం ఫీడ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఉద్యోగులు యోగా చేస్తూ. హైకింగ్ చేస్తూ, స్విమ్మింగ్ పూల్లో సరదాగా గడుపుతూ కనిపించారు. ఇష్టమైన వంటకాలను ఆరగిస్తూ, పానీయాలను సేవిస్తూ మధ్యలో మీటింగ్స్కు అటెండవుతూ ఫుల్ జోష్లో ఉన్నారు.
బాలి టూర్ ముగిసిన అనంతరం ఫస్ట్ వర్కింగ్ హాలిడే అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. పనిగంటల్లోనే కాకుండా పని వేళలు ముగిసిన తర్వాత కూడా టీంలో సమిష్టి ధోరణి బలపడటం కీలకమని, ఇండోనేషియా టూర్ టీం బిల్డింగ్ ప్రక్రియలో అత్యుత్తమ అనుభవమని కంపెనీ ఎండీ కత్య వకులెంకో చెప్పారు. అన్ని విభాగాల్లోని ఉద్యోగులు ఈ టూర్లో కలుసుకుని ఎంజాయ్ చేశారు. మీటింగ్లతో ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకున్నారు.