రాయ్పూర్: నాలుగున్నర రోజులపాటు బోరుబావిలో చిక్కుకున్న బాలుడు చికిత్స తర్వాత కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ చేశారు. దీంతో తమ కుమారుడ్ని కాపాడిన వారందరికీ ఆ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్-చంపా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిహ్రిద్ గ్రామానికి చెందిన 11 ఏళ్ల రాహుల్ సాహూ, ఈ నెల 10న ఆడుకుంటూ ఇంటి వెనుక ఉన్న బోరుబావిలో పడ్డాడు. 60 అడుగుల లోతులో చిక్కుకున్న ఆ బాలుడ్ని రక్షించడం అధికారులకు చాలా కష్టంగా మారింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీతో సహా సుమారు 500 మంది రంగంలోకి దిగారు. భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. విరామం లేకుండా 110 గంటలు శ్రమించారు. ఈ నెల 14న సాహూను బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఆసుపత్రిలో పది రోజులు చికిత్స పొందిన రాహుల్ సాహూ కోలుకున్నాడు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకున్న జంజ్గిర్-చంపా జిల్లా కలెక్టర్ ఆ బాలుడు తన కుటుంబంతో కలిసి గ్రామానికి చేరుకునేందుకు శనివారం ఏర్పాట్లు చేశారు. అలాగే సాహూ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు.
మరోవైపు తన కుమారుడిని కాపాడిన వారందరితోపాటు రెస్క్యూ టీంతో నిరంతరం సంప్రదింపులు జరిపిన సీఎం భూపేష్ బాఘేల్కు బాలుడి తండ్రి రామ్కుమార్ సాహూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, సాహును రక్షించిన రెండు రోజుల తర్వాత, చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్పై ఓ డాక్యుమెంటరీ తీయాలని సీఎం బాఘేల్ అన్నారు. నాలుగున్నర రోజులు బోరుబావిలో ఉన్న సాహూ ధైర్యాన్ని కొనియాడిన ఆయన, వైద్యంతోపాటు చదువుకు అయ్యే ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.