వాషింగ్టన్: ఒక జంట పెళ్లి ఖర్చు రూ.23 లక్షలకుపైగా ఉంది. దీంతో పెళ్లికి హాజరయ్యే అతిథులే అన్ని ఖర్చులు భరించాలని ఆ వధువు షరతు విధించింది. ఈ మేరకు తన స్నేహితులు, బంధువులకు ఆన్లైన్లో వెడ్డింగ్ కార్డ్ పంపింది. ఫొటోగ్రాఫర్, పెడిక్యూర్, వెడ్డింగ్ డ్రెస్ నుంచి హనీమూన్ వరకు అయ్యే ఖర్చులు అతిథులే భరించాలని అందులో పేర్కొంది. ‘బహుమతులు వద్దు, అన్ని ఖర్చులకు డబ్బులు ఇవ్వండి’ అని స్పష్టం చేసింది.
కాగా, వధువు పంపిన ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుకున్న ఒక వ్యక్తి దానిని చదివి షాక్ అయ్యారు. ‘అతిథులు ప్రతిదానికీ చెల్లించాలని వధువు కోరుతోంది’ అంటూ రెడ్డిట్లో ఒక పోస్ట్ చేశారు. ఆ జంట పెళ్లి ఖర్చు 30,000 డాలర్లు (రూ.23.3 లక్షలు)గా తెలిపారు. అయితే పెడిక్యూర్, వెడ్డింగ్ డ్రెస్, వీడియోగ్రఫీ, హనీమూన్తో సహా అన్ని ఖర్చులు అతిథులే భరించాలని వధువు స్పష్టం చేసిందన్నారు. ‘ఎలాంటి బహుమతులు వద్దు, అన్ని ఖర్చులకు నిధులివ్వండి’ అని ఆ వెడ్డింగ్ రిజిస్ట్రీ వెబ్సైట్లో ఉందన్నారు.
పెళ్లికి అయ్యే ప్రతి ఖర్చుకు చెల్లింపులతోపాటు నగదు ఫండ్, హనీమూన్ ఫండ్ వంటివి అందులో ఉన్నాయని ఆ వ్యక్తి తెలిపారు. ఒకవేళ ఆ పెళ్లికి 125 మంది హాజరైతే ప్రతి ఒక్కరూ 250 డాలర్లు (సుమారు రూ.20,000) చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే కేవలం యువకులు లేదా పిల్లలు లేని వారు మాత్రమే ఈ ఖర్చును భరించగలరని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైరల్ అయిన ఈ పోస్ట్పై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించడంతోపాటు పలు సూచనలు చేశారు.