న్యూఢిల్లీ: దొంగలు ఎవరైనా విలువైన వస్తువులు దొంగిలిస్తుంటారు. ముఖ్యంగా బంగారం, నగదు వాళ్ల టార్గెట్గా ఉంటాయి. కానీ జపాన్కు చెందిన ఈ దొంగకు మాత్రం నగా నట్రా, డబ్బు దస్కం అస్సలు అక్కర్లేదు. అతని టార్గెట్ కేవలం ఆడవాళ్ల లోదుస్తులు మాత్రమే. అందులో ఎక్కువగా టీనేజ్ అమ్మాయిల లోదుస్తులే ఉంటాయి. మనోడు ఏదో ఒకటీ రెండు సార్లు ఇలాంటి దొంగతనాలు చేసి ఉంటాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆడవాళ్ల లోదుస్తులను దొంగిలించడమే అతని పనిగా పెట్టుకున్నాడు. అలా ఇప్పటివరకు ఏడు కాదు 70 కాదు ఏకంగా 700కు పైగా లోదుస్తులను మాయం చేసి తన ఇంట్లో దాచుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల జపాన్కు చెందిన టెట్సూ ఉరాటా (56) దక్షిణ జపాన్లోని ఒయిటా ఏరియాలోగల ఓ లాండ్రీ షాపు నుంచి 21 ఏండ్ల విద్యార్థినికి సంబంధించిన ఆరు జతల ప్యాంటీలు (డ్రాయర్లు) దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. దాంతో ఉరాటాను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి ఇంట్లో సోదా చేసేందుకు వెళ్లారు. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎటుచూసినా ఆడవాళ్ల అండర్వేర్లే కనిపించాయి. పోలీసులు ఆ మొత్తం అండర్వేర్లను లెక్కించగా మొత్తం 730 పీస్లు ఉన్నట్టు తేలింది. అందులో ప్యాంటీలు, బ్రాలు, పెట్టకోట్లు, స్విమ్ సూట్లు ఇలా అన్ని రకాల లోదుస్తులు ఉన్నాయి.
కాగా, తాము ఒక దొంగ నుంచి ఇంత భారీ మొత్తంలో అండర్వేర్లను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని జపాన్లోని బెప్పూ నగర పోలీసులు చెప్పారు. ఇవన్నీ ఎక్కడి నుంచి దొంగిలించావు అని పోలీసులు ప్రశ్నించగా.. ఎక్కువగా లాండ్రీ షాపుల నుంచి కొన్ని ఇండ్ల నుంచి అని టెట్సూ ఉరాటా తెలిపాడు. కాగా, ఈ అండర్వేర్ల దొంగతనానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఈ దొంగ ఇలాంటి దొంగతనాలకు ఎందుకు అలవాటు పడినట్లు అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అయితే, ఆడవాళ్ల అండర్వేర్లు దొంగిలిస్తూ దొంగలు పట్టుబడటం ఇదే మొదటిసారి కాదట. కొన్ని నెలల క్రితం తకహిరో కుబో అనే 30 ఏండ్ల ఎలక్ట్రీషియన్ కూడా దక్షిణ జపాన్లో ఆడవాళ్ల లోదుస్తులు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. అతని నుంచి పోలీసులు మొత్తం 424 పీసులు అండర్వేర్లను స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో కూడా ఇద్దరు యువకులు అమ్మాయిల లోదుస్తులు దొంగిలిస్తూ పట్టుబడ్డారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఆ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.