గౌహతి: ఒక వ్యక్తి గత కొంత కాలంగా నాణేలను పొదుపు చేస్తూ వచ్చాడు. ఇటీవల బస్తా నిండా నాణేలను తీసుకెళ్లి స్కూటర్ కొన్నాడు. అస్సాంలోని బార్పేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్టేషనరీ షాపును నిర్వహించే ఒక వ్యక్తికి ద్విచక్ర వాహనం కొనడం చిర కాల కలగా మిగింది. దీంతో అతడు గత కొన్ని నెలలుగా చిల్లరను ఒక బస్తాలో పోగు చేయడం ప్రారంభించాడు. నాణేలతో ఆ బస్తా నిండటంతో స్కూటర్ కొనేందుకు ఆ డబ్బు సరిపోతుందని భావించాడు.
దీంతో ఆ వ్యక్తి ఇటీవల ఒక షోరూమ్కు వెళ్లాడు. నాణేలతో నిండిన బస్తాను తన వెంట తీసుకెళ్లాడు. ముగ్గురు షోరూమ్ సిబ్బంది ఆ చిల్లర బస్తాను లోపలికి మోసుకొచ్చారు. అనంతరం వాటిని నాలుగు ప్లాస్టిక్ బుట్టల్లో వేసి లెక్కించారు. దీనికి వారు చాలా శ్రమ పడ్డారు. చివరకు ఆ వ్యక్తికి స్కూటర్ కీ, పత్రాలు అందజేశారు.
యూట్యూబర్ హిరాక్ జే దాస్ తన ఫేస్బుక్లో దీని గురించి పోస్ట్ చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘ఒక కలను నెరవేర్చుకోవడానికి చాలా డబ్బు అవసరమవుతుంది. అయితే కొద్దికొద్దిగా పొదుపు చేయడం ద్వారా కొన్నిసార్లు ఆ కల నెరవేరుతుంది’ అని దాస్ అందులో పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ వ్యక్తిని అభినందించారు. మరి కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.