సిడ్నీ: సాధారణంగా మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు బతికేయొచ్చు. మంచినీళ్లు లేకుంటే మాత్రం కొన్ని గంటలు కూడా బతుకలేం. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒకటి కాదు, రెండు కాదు పచ్చి మంచినీళ్లు కూడా లేకుండా ఏకంగా ఐదు రోజులు బతికారు. గత మంగళవారం తప్పిపోయిన ఆ ఇద్దరూ పోలీసులు హెలిక్యాప్టర్ సాయంతో తీవ్రంగా గాలించగా ఐదు రోజుల తర్వాత దొరికారు. ఇద్దరూ వేర్వేరు చోట్ల డీహైడ్రేషన్కు గురైన స్థితిలో కనిపించారు.
వివరాల్లోకి వెళ్తే.. షాన్ ఎమిట్జా (21), మహేశ్ పాట్రిక్ (14) అనే ఇద్దరు వ్యక్తులు గత మంగళవారం సెంట్రల్ ఆస్ట్రేలియాలోని హార్ట్స్ రేంజ్ ఏరియా నుంచి తప్పిపోయారు. హెర్మాన్స్బర్గ్ అనే మారుమూల ప్రాంతానికి చెందిన ఎమిట్జా, పాట్రిక్ వీకెండ్లో విహారయాత్రకు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో దారితప్పి చెత్తాచెదారం, మురికి కంపుతో కూడి, పచ్చి మంచినీల్లు కూడా దొరకని ఏరియాలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హెలిక్యాప్టర్ సాయంతో వారిని గుర్తించి రక్షించారు.
దారి కోసం వెతుకుతూ ఇద్దరూ విడివిడిగా వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. మహేశ్ ప్యాట్రిక్ను శుక్రవారం సాయంత్రం బుష్లాండ్ ఏరియాలో గుర్తించారు. శనివారం అక్కడికి సమీపంలోని మరో ప్రాంతంలో షాన్ ఎమిట్జా ఆచూకీ కనిపెట్టారు. ఇద్దరూ తీవ్ర డీహైడ్రేషన్కు గురైన స్థితిలో వాళ్లు దొరకడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది.