సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వల్ల స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. సమాజంలోగల అన్నివర్గాల స్త్రీల జీవితాలపై ఇది దుష్ప్రభావాన్ని చూపుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం 1983లో వరకట్నాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. అయితే, వరకట్నాన్ని సమర్థిస్తూ నర్సింగ్ విద్యార్థుల కోసం రూపొందించిన పాఠ్యపుస్తకంలోని ఒక పేజీ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందంగాలేని అమ్మాయిలు ఆకర్షణీయమైన కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చని ఇందులో పేర్కొన్నారు. కొత్తగా పెళ్లైన వధువులు అత్తారింటికి ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లాంటి బహుమతులతో అడుగుపెట్టేందుకు కట్నం ఉపయోగపడుతుందని రాశారు.
ఈ వివాదాస్పద పాఠం నర్సింగ్ విద్యార్థులకోసం రూపొందించిన ‘టెక్స్ట్బుక్ ఆఫ్ సోషియాలజీ ఫర్ నర్సెస్’ పుస్తకంలో ఉంది. ఈ పుస్తక రచయిత టీకే ఇంద్రాని. ‘వరకట్న భారం కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ అమ్మాయిలను చదివిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయిలకు కట్నం డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఇది వరకట్నం పరోక్ష ప్రయోజనం.’ అని ఆ పాఠంలో పేర్కొన్నారు. కాగా, ఈ పేజీ సోషల్మీడియాలో వైరల్ కావడంతో, కలకలం రేగింది. ఈ పాఠ్యపుస్తకాన్ని సర్క్యులేషన్నుంచి తొలగించాలని రాజకీయనాయకులతోపాటు పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు.
ఈ పుస్తకంలోని విషయాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు. వరకట్నం గురించి పాజిటివ్గా వివరించే పాఠ్యపుస్తకం వాస్తవానికి మన పాఠ్యాంశాల్లో ఉండడం దేశానికి, రాజ్యాంగానికి అవమానకరమని ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. అలాగే, పాఠ్యపుస్తకంలోని విషయాలను ‘ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (టీఎన్ఏఐ) కూడా ఖండించింది. ఈ మేరకు ప్రచురణకర్తలు జేపీ బ్రదర్స్కు లేఖ కూడా రాసింది.
College textbook in India. pic.twitter.com/LOM4grizJq
— Aparna (@chhuti_is) April 3, 2022