పరమత సహనం భారతీయతకు మారుపేరు. భారతదేశమంటే భిన్నత్వంలో ఏకత్వం. దేశంలో ఎన్నో మతాలున్నా అందరూ కలిసికట్టుగా జీవిస్తారు. కాగా, కొందరు తమ స్వార్థంకోసం ఈ మధ్య మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. దీంతో అక్కడక్కడా మత ఘర్షణలు చూస్తున్నాం. అయితే, ముంబైలో పరమత సహనం చాటే ఓ సన్నివేశం నెటిజన్లను ఆకట్టుకున్నది. తను బుక్ చేసుకున్న ఉబెర్ క్యాబ్లో ముస్లిం డ్రైవర్ను నమాజ్ చేసుకునేందుకు అనుమతించిన మహిళ అందరి హృదయాలు గెలుచుకున్నది.
ముంబైకి చెందిన ప్రియాసింగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఉబెర్ కారును బుక్ చేసుకున్నది. ప్రయాణం ప్రారంభమైన పది నిమిషాల తర్వాత డ్రైవర్ ఫోన్లో అజాన్ వినిపించింది. దీంతో ఆమె అతడిని ‘ఇఫ్తార్ చేశారా?.. ఉపవాసం విడిచిపెట్టారా?’ అని ప్రశ్నించింది. దానికి అతడు ‘అవును..డ్యూటీలో ఉన్నాను కదా..విడిచిపెట్టాను’ అని సమాధానం ఇచ్చాడు. ఆ వెంటనే ఆమె ‘నమాజ్ చేస్తారా?’ అని ప్రశ్నించింది. ‘నమాజ్ చేసుకోవచ్చా?’ అని అతడు అడిగాడు. ఆ మహిళ కారు ఆపమని కోరింది. కారు దిగి ముందు సీటులోకి వెళ్లి కూర్చుంది. ఆ డ్రైవర్ వెనుక సీటును పక్కకు జరిపి నమాజ్ చేసుకున్నాడు.
ఈ విషయాన్ని ప్రియాసింగ్ లింక్డ్ ఇన్లో రాసింది. ‘భారతీయత అంటే ఇది.. నా తల్లిదండ్రులకు నాకు ఇదే నేర్పించారు’ అని రాసింది. కాగా, ఈ పోస్ట్పై ప్రియాసింగ్కు మిశ్రమ స్పందన లభించింది. చాలామంది మెచ్చుకోగా, కొందరు దీన్ని కూడా పోస్ట్ పెట్టడం అవసరమా? అంటూ విమర్శించారు.