మెదక్, ఏప్రిల్ 8 : ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో పంట చేతికి వస్తున్నదని, ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టు, నిర్వహణపై వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచినా వానకాలం కంటే ఈ యాసంగిలో 17 వేల ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. పాపన్నపేట, హవేళీఘణాపూర్, మెదక్ మండలాల నుంచి అత్యధికంగా ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 17 శాతం తేమ మించకుండా తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసు కోవాలన్నారు.
మెదక్ జిల్లాలో 322 కేంద్రాల నుం చి 350కి పెంచామన్నారు. రైతులు హార్వెస్టింగ్, పంట కోతలు సమక్రంగా చేసేలా చూడాలని, మూడో రకం ధాన్యాన్ని మాత్రమే ప్యాడీ క్లీనర్లో శుభ్రపరిచేలా రైతులకు సూచించాలన్నారు. ఈ నెల 12వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున అవసరమైన అన్ని పరికరాలు, గోనె సంచులు సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షం పడే సూచనలు కనిపించిన వెంటనే రైతులకు సమాచారమిచ్చి ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరాం, జిల్లా వ్యవసాయాధికారి పరుశురాంనాయక్, డీపీవో తరుణ్, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.