పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నారా? పచ్చని అడవుల్లో పర్యటించాలని ఉందా? అలా అడవుల్లో పర్యటిస్తూ.. ట్రెక్కింగ్ చేయాలని ఉందా? అయితే ఆలస్యం ఎందుకు.. ఇక వెళ్దాం పదండీ క్షీర జలపాతం ( Ksheera Waterfalls )చూసేందుకు. మరి ఈ జలపాతం ఎక్కడుందో తెలుసా..?
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మేడారం గ్రామానికి సమీపంలో క్షీర జలపాతం ( Ksheera Waterfalls ) ఉంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో క్షీర జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ జలపాతం అందాలను చూసేందుకు మంచిర్యాల జిల్లా పరిధిలోని పర్యాటకులు భారీగా తరలివెళ్తున్నారు.
క్షీర జలపాతం ఇటీవల కాలంలోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. ప్రకృతి ప్రేమికులకు క్షీర జలపాతం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. 100 అడుగుల ఎత్తులో నుంచి నీరు కిందకు ప్రవహిస్తుండటంతో.. పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతోంది.
క్షీర జలపాతం చేరుకోవడానికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. మేడారం నుంచి దట్టమైన అడవిలో మూడు కిలోమీటర్ల మేర నడిచిన తర్వాత క్షీర జలపాతం దర్శనమిస్తోంది. అయితే పర్యాటకులు కాలి నడక మార్గాన్ని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానికులు లేదా గొర్రెల కాపర్ల సహాయం తీసుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లే పర్యాటకులు మొదట మంచిర్యాల – ఆసిఫాబాద్ రోడ్డుకు చేరుకోవాలి. మంచిర్యాల టౌన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మేడారం గ్రామం ఉంటుంది. మేడారం నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల మేర కాలినడక ప్రయాణం చేయాలి. దారి మధ్యలో గాంధారి పోర్ట్ను కూడా పర్యాటకులు గుర్తించొచ్చు.