Kedarkantha Trek | ఉత్తరాఖండ్.. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న దేవభూమి. మహర్షులు నడయాడిన పుణ్యస్థలి. ఎత్తయిన కొండలు, పచ్చని నేల, చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. ఈ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో సముద్ర మట్టానికి 12,500 అడుగుల ఎత్తులో ఉన్న అత్యంత సుందరమైన పర్వత శిఖరం.. కేదార్ కంఠ. అక్కడికి వెళ్లిరావడం ఓ జీవితకాల అనుభవం.
శీతకాలంలో ఇక్కడి పర్వత ప్రాంతాలన్నీ మంచు దుప్పటి కప్పేసుకొని అత్యంత రమణీయంగా కనిపిస్తుంటాయి. ఆ మంచు పర్వతాలపై ప్రసరించిన భానుడి కిరణాలు మిరుమిట్లు గొలుపుతూ ప్రత్యేకమైన అనుభూతిని పంచుతాయి. ఉత్తరాఖండ్, ఉత్తర కాశి జిల్లాలో 8,500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న గ్రామం నైట్వాడ్. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో కేదార్ కంఠ పర్వత శిఖరం ఉంది. సాహస యాత్రికులు ఆ శిఖరాన్ని చేరుకోవడానికి నైట్వాడ్ నుంచి ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. యూత్ హాస్టల్స్ అసో సియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్ఏఐ) ఆధ్వర్యంలో ప్రతి ఏటా డిసెంబర్లో కేదార్ కంఠ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. రోజూ ఇరవై ఇరవై అయిదు మంది బృందంగా మొత్తం ఇరవై బ్యాచ్లు బయల్దేరతాయి. ఇందుకోసం ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.
ఆరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణమై రాత్రి 10 గంటలకు ముస్సోరి చేరుకున్నాం. మరుసటి రోజు బయలుదేరాల్సిన బ్యాచ్ వాళ్లంతా ముందురోజు రాత్రికే ముస్సోరి క్యాంప్ చేరుకోవాలని నిబంధన. ఆ రాత్రి క్యాంప్ ఫైర్ వేసుకొని.. చలిని ఎంజాయ్ చేశాం. పాటలు వింటూ, డ్యాన్స్ చేస్తూ ఉల్లాసంగా గడిపాం. ఉదయమే బయల్దేరాల్సి ఉన్నా.. ముసుగుతన్ని పడుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అలా ఆ రాత్రి తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఏడున్నరకు ముస్సోరి నుంచి ఇరవై మంది బ్యాచ్.. రెండు వాహనాల్లో బయల్దేరి సాయంత్రం 4 గంటలకంతా నైట్వాడ్ చేరుకున్నాం. పర్వత ప్రాంతం కావడం, దారి పొడవునా అత్యంత రమణీయమైన ప్రకృతి సంపద తోడవడంతో.. ప్రతి అడుగునూ ఆస్వాదిస్తూ వెళ్లాం. నూట అరవై కిలోమీటర్లు వెళ్లడానికి మాకు ఎనిమిది గంటలు పట్టింది. నైట్వాడ్లోని ఓ పాఠశాలలో వైహెచ్ఏఐ వారి బేస్ క్యాంప్ ఉంది. అక్కడ మా ధ్రువపత్రాలు చూపించాం. మాకు కేటాయించిన గదుల్లో సామాన్లు సర్దుకున్నాం. రాత్రి భోజనం తర్వాత, క్యాంప్ ఇన్చార్జి సమావేశం ఏర్పాటుచేశారు. అనేక సూచనలు ఇచ్చారు. వాటిని మననం చేసుకుంటూ నిద్రకు ఉపక్రమించాం.
మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకే నిద్రలేపారు. విపరీతమైన చలి. గంటసేపు మాతో వ్యాయామం చేయించారు. ఆ తర్వాత వేడివేడి టిఫిన్, టీ ఇచ్చారు. ఆ సమయంలో అది అమృతంలా అనిపించింది. తొమ్మిది గంటలకు అందరికీ ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీరం తనను తాను సర్దుబాటు చేసుకోడానికి ‘ఐక్లెమేటైజేషన్ వాక్’ పేరుతో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణ మందిరం వరకూ వాకింగ్ తీసుకెళ్లారు. తిరిగి వచ్చాక మధ్యాహ్న భోజనం, విశ్రాంతి. సాయంత్రం టీ తర్వాత మరుసటి రోజు ట్రెక్కింగ్కు సంబంధించిన సూచనలు చేశారు. రాత్రి భోజనాల తర్వాత కాసేపు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నడిచాయి. ట్రెక్కింగ్ పూర్తి చేసుకొని వచ్చినవాళ్లు, మరుసటి రోజు వెళ్లాల్సినవాళ్లు.. అంతా కలిసి ఆడిపాడాం. పొద్దున్నే ట్రెక్కింగ్ ప్రారంభం. ఉదయం ఏడింటికల్లా అల్పాహారం ముగించుకొని లంచ్ ప్యాక్ చేసుకొని 20మంది బృందంగా.. ఇద్దరు గైడ్లతో ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాం. దారి పొడవునా దేవదారు, పైన్ వృక్షాలు. ఇంకా ఎన్నో అరుదైన వృక్ష జాతులు. అందమైన జంతువులు కూడా కనువిందు చేశాయి. ఎనిమిదింటికి బయల్దేరి మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల మేర నడిచి సాయంత్రానికి జలోటా థాచ్ చేరుకున్నాం. పదివేల అడుగుల ఎత్తులో ఒక సెలయేరు పక్కన మా క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆ సెలయేరు మొత్తం గడ్డకట్టి పోయింది. వంటకైనా, తాగడానికైనా.. మంచును కరిగించి వేడిచేసిన నీళ్లే దిక్కు. క్యాంప్ చేరుకోగానే వేడివేడి ఆలుబోండాలు, టీ అందించారు.
సాయంత్రం ఐదున్నరకు అక్కడి నుంచే సూర్యాస్తమయాన్ని ఆస్వాదించాం. అక్కడే గంటసేపు గడిపాం. అసలు సమయమే తెలియలేదు. ఇక రాత్రికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు చెప్పి ఏడింటికే భోజనం ఏర్పాటు చేశారు ఇన్చార్జి. రోజంతా ట్రెక్కింగ్లో అలసిపోవడం వల్ల తొందరగానే నిద్రపట్టింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసి లంచ్ ప్యాక్ చేసుకొని మళ్లీ ట్రెక్కింగ్ పారంభించాం. మా టార్గెట్ లొకేషన్ పుఖ్రోల థాచ్.. పదకొండువేల అడుగుల ఎత్తులో ఉంది. ఎక్కడ చూసినా తాజా మంచు. మధ్య మధ్యలో హిమపాతం, హరివిల్లు.. మా యాత్రాను భూతిని రెట్టింపు చేశాయి. ఢిల్లీలో అత్యంత కాలుష్య వాతావరణంలో బతుకుతున్న నన్ను స్వచ్ఛమైన ప్రకృతి, నీలిరంగు ఆకాశం, తెల్లటి మేఘాలు.. మరో లోకంలో విహరింపచేశాయి. ప్రకృతి ప్రేమికులు ఇంతకుమించి ఇంకేం కోరుకుంటారు? ఆ అనుభూతి కోసమే దేశం నలుమూలల నుంచీ ఎంతోమంది శ్రమకోర్చి వస్తారు. మా బృందంలో కూడా 10 రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. అలా 8 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పుఖ్రోల థాచ్ క్యాంప్ చేరుకున్నాం. వేడివేడి టీ, స్నాక్స్ ఆరగించి సేదతీరాం. ఆ రోజు రాత్రి టెంపరేచర్ మైనస్ 10 వరకు పడిపోవచ్చని మా క్యాంప్ ఇన్చార్జి చెప్పారు. తగిన జాగ్రత్తలు సూచించారు.
తెల్లవారుజామునే 2:30కి నిద్ర లేపారు. మూడు గంటలకల్లా సిద్ధమయ్యాం. వేడివేడి మ్యాగీ, టీ ఇచ్చారు. థర్మాస్లో వేడి నీళ్లు నింపుకొని, బ్యాగులు క్యాంప్లోనే వదిలేసి హెడ్ టార్చ్ వేసుకొని కేదార్ కంఠ శిఖరానికి బయల్దేరాం. శిఖరాన్ని చేరుకోడానికి 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. మధ్యలో కొంత కష్టతరమైన దారి ఉంటుంది. పౌర్ణమి రాత్రి కావడంతో చంద్రుని కాంతిలో ప్రకృతి సోయగాలు చూడముచ్చటగా అనిపించాయి. అలా 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత ఉదయం ఆరున్నరకు కేదార్ కంఠ శిఖరం చేరుకున్నాం. ఆకాశం అరుణమయమై అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఆ ఎత్తు నుంచి 360 డిగ్రీల్లో ఎటు చూసినా ప్రకృతి సోయగాలు వర్ణనాతీతం. ఉదయం ఏడు గంటలకు మెల్లమెల్లగా మబ్బులను చెరిపేసుకుంటూ సూర్య భగవానుడు దర్శనం ఇచ్చాడు. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. మైనస్ 15 డిగ్రీల వాతావరణ పరిస్థితుల్లో అరగంట సేపు సూర్యోదయాన్ని ఆస్వాదించి తిరుగు ప్రయాణం ప్రారంభించాం. పదిన్నరకంతా క్యాంప్ చేరుకున్నాం. పదకొండు గంటలకు భోజనం చేసుకొని 9 వేల అడుగుల దిగువన ఉన్న అఖోటి థాచ్కి బయలుదేరాం. సాయంత్రం 4 గంటలకు క్యాంప్ చేరుకొని టీ, స్నాక్స్ తీసుకొని ఆ రాత్రికి క్యాంప్లోనే ఉండిపోయాం. రాత్రంతా, గత ఐదు రోజులూ తీసిన అద్భుతమైన చిత్రాలను ఇచ్చిపుచ్చుకున్నాం. ఆనందాన్ని పంచుకున్నాం. మరుసటి రోజు.. ఉదయం అఖోటి థాచ్లో బయల్దేరి సాయంత్రానికి నైట్వాడ్ క్యాంప్కు చేరుకొన్నాం. ట్రెక్ పూర్తి చేసినట్టుగా.. అధికారులు అందించిన సర్టిఫికెట్ తీసుకొని రాత్రి అక్కడే బసచేశాం. తెల్లారగానే నైట్వాడ్ నుంచి డెహ్రాడూన్ బయల్దేరాం. సాయంత్రం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ రైలులో జ్ఞాపకాల లగేజీతో ఇంటికి చేరుకున్నాం.
…? అవడం రంగనాథ్, డిప్యూటీ డైరెక్టర్, కేంద్ర ఆర్థికశాఖ
“Clearwater Beach | అమెరికాలోని ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే..”