న్యూఢిల్లీ, అక్టోబర్ 10: జ్యుడిషియరీ విభాగం నుంచి త్వరలో ఏడుగురు జడ్జీలు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవనున్నారు. సీనియర్ జిల్లా జడ్జీలుగా చేస్తున్న పీ శ్రీసుధ, డాక్టర్ సీ సుమలత, డాక్టర్ జీ రాధారాణి, ఎం లక్ష్మణ్, ఎన్ తుకారంజీ, ఏ వెంకటేశ్వర్రెడ్డితోపాటు ఆదాయం పన్నుశాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలిగా పనిచేస్తున్న టీ మాధవీలతను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించినట్టు తెలుస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదంతో ఈ ఫైళ్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపినట్టు సమాచారం. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ను వెలువరిస్తుంది. ఆ వెంటనే ఏడుగురితో న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. చాలాకాలంగా జిల్లా జడ్జీల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించలేదు.
తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డాక జిల్లా జడ్జీలకు పదోన్నతి లభించడం ఇదే తొలిసారి. 24 మంది న్యాయమూర్తులు పనిచేయాల్సిన తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం 10 మంది న్యాయమూర్తులే ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకరించిన కొద్ది రోజులకే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 42 పెంచాలని నిర్ణయించారు. జస్టిస్ సతీశ్చంద్ర శర్మను ఇటీవల రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆయనతోపాటు మరో ఏడుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణం చేస్తే రాష్ట్ర హైకోర్టు జడ్జీల సంఖ్య 18కి పెరుగుతుంది. అయినా మరో 24 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉంటాయి.
13న ఏపీ సీజేగా మిశ్రా ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ఈ నెల 13న ప్రమాణం స్వీకరించనున్నారు.