జైపూర్: దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునికతవైపు మళ్లుతున్నా.. ఇప్పటికీ ఆడ, మగ మధ్య తేడాలు కన్పిస్తూనే ఉన్నాయి. తల్లిదండ్రులు తమ కొడుకును ఒకవిధంగా, కూతురిని మరోలా చూడటంలాంటి వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి అసమానతలను పక్కనబెట్టింది ఓ రాజస్థానీ కుటుంబం. 35 ఏండ్ల తర్వాత తమ కుటుంబంలో లేకలేక జన్మించిన ఆడబిడ్డకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ చిన్నారి తమ ఇంట్లో అడుగుపెట్టే శుభఘడియను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంచుకోవాలనుకున్నారు. దీనికోసం ఏకంగా ఓ హెలికాఫ్టర్నే బుక్చేశారు.
రాజస్థాన్లోని నౌగౌర్ జిల్లాలోని నిమిబ్డి చందావతాకు చెంది హనుమాన్ ప్రజాపత్, చుకిదేవి దంపతులు. వారికి గత నెలలో ఆడ శిశువు జన్మించింది. అయితే ప్రసవానంతరం దవాఖాన నుంచి ఆమె తన పుట్టింటికి వెళ్లింది. 35 ఏండ్ల తర్వాత తమ కుటుంబంలోకి చిన్నారి రావడంతో హనుమాన్తోపాటు, అతని తల్లిదండ్రులు ఖుషీ అయ్యారు. పాపకు నెల రోజులు నిండటంతో తమ ఇంటికి తీసుకువాలనుకున్నారు. అయితే ఆ చిన్నారిని తమ ఇంట్లోకి ఘనంగా ఆహ్వానించాలని, అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని దీనికోసం ఓ హెలికాప్టర్ను బుక్చేసుకున్నారు. దీనికి రూ.4.5 లక్షలు ఖర్చుచేశారు.
తమ ఊరి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తగారింటికి హెలికాప్టర్ వెళ్లిన హనుమాన్.. తన కుమార్తెను తీసుకొచ్చాడు. ఆ చిన్నారికి తాతా నానమ్మ ఘనంగా స్వాగతంపలికారు. దీనిని ఒక వేడుకలా నిర్వహించారు. తన తండ్రికే ఈ ఆలోచన వచ్చిందని హనుమాన్ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..