హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో 3 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. గతేడాది చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెలంతా విద్యార్థులు బ్రిడ్జికోర్సునే అభ్యసించాల్సి ఉంటుంది. వారానికి ఐదు రోజులు, ఒక్కో పీరియడ్ అరగంట మాత్రమే ఉంటుంది. మొత్తం 240 పాఠ్యాంశాలను ఆన్లైన్లో బోధించేందుకు ఏర్పాట్లుచేశారు. 3 -5వ తరగతి వరకు లెవల్ -1గా, 6, 7 తరగతులను లెవల్ -2గా, 8, 9 తరగతులను లెవల్ -3గా, టెన్త్ విద్యార్థులను లెవల్ -4గా విభజించారు.
షెడ్యూల్ ప్రకారం పాఠ్యాంశాలను డీడీ యాదగిరి, టీశాట్ విద్య చానళ్ల ద్వారా ప్రసారం చేయనున్నారు. జూలై ఒకటి నుంచి 7వ తేదీ వరకు షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు బుధవారం విడుదలచేశారు. టీశాట్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అరగంటకొక పీరియడ్ చొప్పున బోధించనున్నారు. డీడీ యాదగిరిలో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు.
ఇంటర్ విద్యార్థులకు ఇలా..
ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సైతం ఆన్లైన్ క్లాసులు గురువారం నుంచే ప్రారంభంకానున్నాయి. అరగంటకో పీరియడ్ చొప్పున దూరదర్శన్లో ఉద యం 8:30 నుంచి 10:30 గంటలవరకు, మధ్యా హ్నం 3- సాయంత్రం 6 గంటల వరకు పాఠ్యాంశాలను ప్రసారంచేయనున్నారు. టీశాట్ ద్వారా ఒకేషనల్ విద్యార్థులకు ఉదయం 7- 9 గంటలవరకు, సాయంత్రం 5- రాత్రి 8:30 గంటల వరకు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు. డిగ్రీ విద్యార్థులకు జూమ్, వెబెక్స్, గూగుల్ మీట్ తదితర యాప్ల ద్వారా వర్చువల్ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తారు.