హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలో ఫిజిక్స్ పేపర్ కఠినంగా ఉన్నదనే అభిప్రాయాన్ని విద్యార్థులు వ్యక్తంచేస్తున్నారు. బోటనీ పేపర్ సులభంగా, కెమిస్ట్రీ, జువాలజీ పేపర్లు మధ్యస్థంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఫిజిక్స్ పేపర్ కఠినంగా ఉండటంతో జవాబులు రాయడానికి ఎక్కువ సమయం తీసుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో వాటిని చదివి, అర్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఒక్కొక్క ప్రశ్నను సాధించేందుకు 2-3 నిమిషాలు తీసుకున్నదని చెప్తున్నారు. ఫిజిక్స్ ఎక్కువ సమయం తినేయడంతో చాలామంది విద్యార్థులు ప్రశ్నలన్నింటికి జవాబులివ్వలేకపోయారు.
సమయాభావం వల్ల కొంతమంది ప్రతిభావంతులు సైతం 5 నుంచి 8 ప్రశ్నలు వదిలేయాల్సి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. సమయం సరిపోక ఆరు ప్రశ్నలు వదిలేసినట్టు ఒక విద్యార్థి చెప్పగా, మూడు ప్రశ్నలు వదిలిపెట్టినట్టు మరో విద్యార్థిని వాపోయింది. ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో ఇబ్బందిపడ్డామని విద్యార్థులు తమతో చెప్పారని అధ్యాపకుడు డాక్టర్ కాసు పవన్కుమార్ పేర్కొన్నారు. దీని ప్రభావం ర్యాంక్లపై పడుతుందని భావిస్తున్నారు. అయితే, గతేడాదితో పోల్చుకుంటే ఈసారి పేపర్ కాస్త సులభంగా ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు తెలంగాణ నుంచి దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకోగా 94 శాతం మంది హాజరైనట్టు అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే కీ విడుదల చేస్తామని, విద్యార్థులు neet.nta.nic.in/ nta.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని ఎన్టీఏ వర్గాలు సూచించాయి.
దేశవ్యాప్తంగా 16లక్షల మంది హాజరు
నీట్-యూజీ 2021 పరీక్ష ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 16లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. 3,858 కేంద్రాల్లో 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు. జీవశాస్త్రం, రసాయనశాస్త్రం పేపర్లు సులువుగా ఉన్నట్టు, గతేడాదితో పోల్చితే భౌతిక శాస్త్రం పేపర్ కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశార్హత కోసం నీట్ నిర్వహిస్తున్నారు.