హైదరాబాద్ : రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఖాళీలతో పాటు మిగతా యూనివర్సిటీల్లోని ఖాళీలను నింపడానికి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చాం. పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయాక ఫలితాలు వచ్చే సమయంలో ఉన్నత న్యాయస్థానాల్లో కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వల్ల స్టే రావడంతో నియామకాలు ఆగిపోయాయి. ఈ స్టే ఆర్డర్ వల్ల దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని యూనివర్సిటీల్లో నియామకాలు ఆగిపోయాయి. ఇది కేంద్రం దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలో వర్సిటీల్లో ఖాళీల భర్తీకి సంబంధించి కేంద్రం.. రాజ్యాంగ సవరణ చేస్తోంది.. అది పూర్తయిన వెంటనే వర్సిటీల్లోని ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి.. ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు లక్షా 34 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు.