
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తొలుత తన వంతుగా కిలో 16 తూలాల బంగారం విరాళంగా ప్రకటించారు. అనంతరం ప్రజలు స్వామివారికి విరాళాలు ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తన కుటుంబం తరపున ఈ విరాళం ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణంలో తాము సైతం భాగస్వామం కావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి టెంపుల్ సిటీలో కాటేజీ నిర్మిణానికి రూ.2 కోట్ల నగదు విరాళం ప్రకటించారు. స్వర్ణ తాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజాప్రతినిధులు కిలో బంగారం చొప్పున విరాళం ప్రకటించారు. వ్యక్తిగతంగా కొందరు, నియోజకవర్గ ప్రజల పక్షాన మరికొందరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు. యాదాద్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, సంస్థలు, ప్రముఖులు భూరి విరాళాలు ప్రకటించారు.
