హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేయటాన్ని ఆపేలా ఆదేశాలివ్వాలని ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత ఉన్నదా అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అంతర్రాష్ట్ర జలవివాదాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు జోక్యం చేసుకోరాదని రాజోలిబండ డైవర్షన్ స్కీం కేసులో సుప్రీంకోర్టు తీర్పుచెప్పిందని గుర్తుచేసింది. ఆ తీర్పు ప్రకారం పిటిషన్కు ఉన్న విచారణ అర్హత ఏమిటో తెలుపాలని ఆదేశించింది. రాజోలిబండ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి మంగళవారం జరిగే విచారణకు రావాలని పిటిషనర్లతో పాటు తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు సూచించింది.
రాష్ట్రంలోని జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వందశాతం విద్యుత్తు ఉత్పత్తి చేయాలని జెన్కోను ఆదేశిస్తూ రాష్ట్ర విద్యుత్తుశాఖ ముఖ్యకార్యదర్శి జూన్ 28న ఇచ్చిన జీవో 34ను సవాల్ చేస్తూ ఏపీకి చెందిన జీ శివరామకృష్ణ ప్రసాద్, ఎం వెంకటప్పయ్య దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్పై విచారణను ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్కు మార్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.