హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ, ఆటో, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కొవిడ్ టీకాలు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం ఆయన బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో కలిసి వ్యాక్సిన్ సేకరణ, డ్రైవర్లకు టీకాలు వేయడంపై సమీక్షించారు. జీహెచ్ఎంసీతోపాటు జిల్లా కేంద్రాల్లో రోజూ 10 వేల మంది డ్రైవర్లకు టీకాలు వేయాలని అధికారులకు స్పష్టంచేశారు. రాష్ర్టానికి కేంద్రం కేటాయించిన వ్యాక్సిన్ కోటా, అందిన వ్యాక్సిన్, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలను సేకరించడం, ఆక్సిజన్ సరఫరా, స్టోరేజ్ యూనిట్ల ఏర్పాట్లు, కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి కూడా చర్చించారు. రాష్ట్రానికి ఎకువ వ్యాక్సిన్ డోసులను కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
69 వేల మందికి వ్యాక్సిన్
రాష్ట్రంలో హైరిస్క్ గ్రూప్కు సంబంధించిన వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. సోమవారం 69,168 మందికి వ్యాక్సిన్లు వేశారు. 1,069 కేంద్రాల్లో 64 వేల మందికి తొలిడోసు, 4,766 మందికి రెండో డోసు వేసినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం విడుదలచేసిన బులెటిన్లో స్పష్టంచేసింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథా కేవలం 0.18 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 18-44 ఏండ్ల మధ్య ఉన్న హైరిస్క్ ప్రజలకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది.