హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్రెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుడు పర్యాద కృష్ణమూర్తితో కలిసి ఉదయం 10 గంటలకు తెలంగాణభవన్లో షెడ్యూల్ విడుదల చేశారు. ఆ వెంటనే నామినేషన్ల దాఖలు కోసం నేతలు క్యూ కట్టారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నల్లగొండ జిల్లా నేతలు నామినేషన్లు వేశారు.
మంత్రుల పక్షాన మహమూద్ అలీ
టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈసారి కూడా సీఎం కేసీఆర్ పేరును హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి బలపరిచారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మంత్రుల బృందం నామినేషన్ పత్రాలను అందజేసింది.
ఎంపీలు, ఎమ్మెల్యేల తరఫున..
పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు.. పార్టీ ఎంపీల తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, నామా నాగేశ్వర్రావు, గడ్డం రంజిత్రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, సురేశ్రెడ్డి, బండ ప్రకాశ్, వెంకటేశ్, ప్రభాకర్రెడ్డి, పోతుగంటి రాములు, లింగయ్యయాదవ్, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి బలపరిచారు. ఎమ్మెల్యేల తరఫున సీఎం కేసీఆర్ పేరును ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి ప్రాతిపదించారు. ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్రెడ్డి, జీవన్రెడ్డి, కాలె యాదయ్య, జైపాల్యాదవ్, దానం నాగేందర్, మెతుకు ఆనంద్, రేఖానాయక్, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, రవీంద్రనాథ్రెడ్డి, షకీల్ అహ్మద్ బలపరిచారు.
ఎమ్మెల్సీలు, రాష్ట్రకమిటీ తరఫున..
ఎమ్మెల్సీల తరఫున కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్సీ భానుప్రకాశ్రావు నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వాణీదేవి, సుభాష్రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, పురాణం సతీశ్, నవీన్కుమార్, పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్రాజు, లక్ష్మీనారాయణ, దయానంద్, తేరా చిన్నపరెడ్డి, దామోదర్రెడ్డి, ఫారూక్ హుస్సేన్, బీజీ గౌడ్ బలపరిచారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం తరఫున పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు నామినేషన్ వేశారు. పార్టీ నేతలు మలిపెద్ది సుధీర్రెడ్డి, వై వెంకటేశ్వర్లు, మెట్టు శ్రీనివాస్, కంచర్ల రామకృష్ణారెడ్డి, చాడ కిషన్రెడ్డి, కిషన్రావు, ఎడవెల్లి కృష్ణారెడ్డి, బండి రమేశ్, కోలేటి దామోదర్, సామేల్, తాడూరి శ్రీనివాస్ బలపరిచారు. నల్లగొండ జిల్లా నేతలు కూడా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్రెడ్డి, నోముల భగత్, శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్, మల్లయ్య యాదవ్ బలపరిచారు.
సందడే సందడి
టీఆర్ఎస్ పార్టీ అధినేతగా మళ్లీ కేసీఆరే ఉండాలని పార్టీలోని అన్ని స్థాయిల నేతలు కార్యకర్తలు నినదిస్తున్నారు. పార్టీ నియమావళిని అనుసరించి నాలుగేండ్లకోసారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతాయి. ఈసారి ఎన్నికల కోసం ఆదివారం షెడ్యూల్ విడుదల కాగా, ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. షెడ్యూల్ విడుదలైన గంట వ్యవధిలోనే సీఎం కేసీఆర్ పేరును అధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆరు సెట్ల నామినేషన్లు వేయటం విశేషం. ప్రతీ సెట్లోనూ అన్ని సామాజిక వర్గాల నేతలు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ, సమర్థిస్తూ సంతకాలు చేశారు. ‘కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, లాంగ్ లివ్.. లాంగ్ లివ్, టీఆర్ఎస్ లాంగ్ లివ్, జై తెలంగాణ.. జై కేసీఆర్’ వంటి నినాదాలతో తెలంగాణభవన్ మార్మోగిపోయింది. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని నేతలు, కార్యకర్తలు స్పష్టంచేశారు.