హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకం ద్వారా బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని దళిత మేధావులు పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ మూ దళితులను వ్యాపారులుగా తీర్చిదిద్దాలని ముందుకు రాలేదని, ఈ అంశంలో మొదటిసారి ముందుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదిలోనే శంకించాల్సిన పనిలేదని వారు తేల్చిచెప్పారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య హుజూరాబాద్లోని దళిత మేధావులు, సామాజికవేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులతో ఆదివారం వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలైన ఎస్సీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకొని దళితబంధు పథకాన్ని ప్రారంభిచారని చెప్పారు.
ఈ పథకంపై ఆదిలోనే కొన్నివర్గాలు అపోహలు, అనుమానాలు వ్యక్తం చేయటం సరికాదని అన్నారు. ఎన్నికల కోసమే హుజూరాబాద్లో ఈ పథకాన్ని ప్రారంభించారని కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని, వాటి ట్రాప్లో పడకూడదని దళితులకు సూచించారు. ఏ వ్యూహంతో ప్రవేశపెట్టినా కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలోనే ఈ పథకాన్ని ప్రారంభించారు తప్ప టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకొన్న రాజకీయ నిర్ణయం కాదనే సత్యాన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, దళిత సాధికారత కోసం పనిచేస్తున్నామని చెప్పుకొనే సంస్థలు గుర్తించుకోవాలని పేర్కొన్నారు. దళితబంధు పథకం ఎన్నికల కోసం వచ్చింది కాదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఏ సీఎం అయినా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ముందుకొచ్చారా? అని ప్రశ్నించారు. చరిత్రాత్మక నిర్ణయంతో ముందుకొచ్చిన సీఎం కేసీఆర్ను స్వాగతించాల్సింది పోయి అదేపనిగా వ్యతిరేకించటం సరికాదని హితవు పలికారు.
ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం..
తెలంగాణ కన్నా దశాబ్దాల ముందు ఏర్పడిన అనేక రాష్ర్టాలు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించలేకపోయాయని మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించి, ఖర్చుకాని నిధులను తదుపరి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ చట్టం చేసిందని గుర్తుచేశారు. కర్ణాటక, ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలు తెలంగాణ చట్టాలను ఇప్పటికే అనుసరించాయని, రేపు దళితబంధును కూడా అనేక రాష్ర్టాలు అమలు చేయాల్సిన అనివార్యత నెలకొంటుందని పేర్కొన్నారు.
మిగితా వర్గాల పథకాలను దళితులు అడ్డుకోలేదు కదా!
రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని దళితులెవరూ ప్రశ్నించలేదు.. అవి తమకూ కావాలని అడుగలేదు కదా అని లక్ష్మయ్య అన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని మొదట ఎస్సీ, ఎస్టీల కోసం ప్రారంభించి ఆ తరువాత దశలవారీగా అందరికీ వర్తింపజేశారని గుర్తుచేశారు. బీసీ బంధు, మైనారిటీ బంధు, గిరిజన బంధు కావాలని కోరేవారిని ఎస్సీలు తప్పు పట్టాల్సిన అవస రం లేదని, అదేవిధంగా దళితబంధును మిగతా వర్గా లు అడ్డుకోకూడదని కోరారు. దళితులు బాగుపడితే తప్పేమిటని ప్రశ్నించారు. బీఆర్ అంబేద్కర్, ఎస్ఆర్ శంకరన్ వంటి మహనీయులు చూపిన బాటలో నడుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారని, దళి త సమాజం కోసం సేవచేయటానికి కంకణబద్ధుడైన ఆయనను తప్పుపట్టడంలో అర్థంలేదని పేర్కొన్నారు.
విద్యావంతులు ఏకం కావాలి
దళితబంధును పటిష్ఠంగా అమలు చేసేందుకు రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు కలిసి పనిచేయాలని వెబినార్లో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ పథకంపై రిటైర్డ్ ఉద్యోగులు, దళిత మేధావులు దళిత సమాజాన్ని చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం హుజూరాబాద్ నియోజకర్గంలో పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేయటానికి సామాజిక మార్పుకోసం చిత్తశుద్ధితో పనిచేసే వారంతా ఒక ఫోర్స్గా ఏర్పడి లబ్ధిదారులను చైతన్యంపరచాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు త్వరలో హుజూరాబాద్లో పర్యటించి దళితబంధుపై ప్రజలకు వివరించేందుకు సిద్ధం కావాలని నిర్ణయించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పూలాల సంజీవయ్య, గణపతి, ఇంజం వెంకటస్వామి, అంతడుపుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.