నాడి పడితే వందలు.. చిన్న టెస్టుకే వేలకువేలు.. జలుబుచేసినా పదీఇరవై రకాల టెస్టులు చేయించే అరాచక వైద్యం.. రాత్రీపగలు కష్టపడి పైసా పైసా కూడబెట్టే సగటుజీవికి చిన్న జ్వరం వచ్చినా ఏడాది సంపాదనంతా ఒక్క టెస్టుతో కొట్టుకుపోయే దుస్థితి. ఇదీ ప్రైవేట్లో రోగనిర్ధారణ (డయాగ్నస్టిక్స్) టెస్టుల పరిస్థితి.. సామాన్యులకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వ దవాఖానలు నెలకొల్పినప్పటికీ.. వ్యాధి నిర్ధారణ టెస్టుల కోసం ప్రైవేటురంగాన్ని ఆశ్రయించక తప్పని దుస్థితిని సృష్టించాయి గత ప్రభుత్వాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్ర మారుతున్నది. ప్రభుత్వ దవాఖానలకు చికిత్స చేసి, దారిన పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు మోయలేని భారంగా పరిణమించిన వ్యాధి నిర్ధారణ టెస్టులను సైతం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): 57 రకాల పరీక్షలు.. 22 లక్షల ఫలితాలు.. 1.15 లక్షల మంది రోగులకు తప్పిన రూ.22 కోట్ల ఖర్చు.. కేవలం రెండున్నర నెలల్లోనే తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్లు సాధించిన రికార్డులివి. పేదలకు వైద్యంతోపాటు ఉచితంగా వైద్య పరీక్షలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన డయాగ్నస్టిక్ హబ్లు రోగులకు ఏ స్థాయిలో సేవలు అందిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో జూన్ 9వ తేదీన ఇవి ప్రారంభమయ్యాయి. రెండున్నర నెలల్లోనే 1,15,711 మంది పేషెంట్లు పరీక్షలు చేయించుకొన్నారు. వీరి నుంచి సేకరించిన శాంపిళ్లతో 22,06,912 పరీక్షలు నిర్వహించారు. ఒక్కో ఫలితాన్ని గుర్తించేందుకు సగటున రూ.100 ఖర్చు వేసుకొన్నా రూ.22 కోట్ల విలువైన పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ పరీక్షలకు ప్రైవేటులో ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు అవుతుందని, ఈ మొత్తం డబ్బు పేదలకు ఆదా అయ్యిందని పేర్కొన్నారు.
వేగంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు
జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్ల పరిధిలోని పీహెచ్సీ, సీహెచ్సీ, ఏహెచ్, జిల్లా దవాఖానలు, బస్తీ దవాఖానల నుంచి ప్రతిరోజూ శాంపిళ్లు సేకరిస్తున్నారు. ఏ రోజుకారోజే వాటిని ఐస్బాక్స్లున్న ప్రత్యేక వాహనాల్లో జిల్లా డయాగ్నస్టిక్ హబ్కు తరలిస్తున్నారు. అక్కడ టెస్టులు చేసి, రిపోర్టును పేషెంట్కు మొబైల్ ద్వారా, వైద్యుడికి ఆన్లైన్ ద్వారా అందజేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ యంత్రాల పనితీరు, ఫలితాల నాణ్యతను పర్యవేక్షించేందుకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్, సీఎంసీ వెల్లూరు వైద్యసంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది.
ఫలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు
‘చికిత్స కంటే నివారణ ఎంతో మంచిది’ అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసేలా ఒక్కొక్క డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు కోసం రూ.2.5 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒక్కొక్క సెంటర్లో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో డయాబెటిక్ ప్రొఫైల్, హార్మోన్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, సీబీపీ, మైక్రోబయాలజీ తదితర విభాగాలున్నాయి. హైదరాబాద్లో సెంట్రల్ హబ్, 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్స్ హబ్స్ ఉండగా, మరో 13 జిల్లాల్లో త్వరలోనే వీటిని నెలకొల్పనున్నారు.