హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ సిగలో మరో అద్భుతం చేరనున్నది. ఇతర మెట్రో నగరాలకు దీటుగా ఆకాశమే హద్దు అన్నట్టు మరో భారీ భవంతి నిర్మాణ ప్రాజెక్టుకు అడుగుపడింది. వాసవీ గ్రూప్ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్ అత్యంత విశాలమైన 44 అంతస్తుల టవర్ల నిర్మాణం చేపడుతున్నది. గచ్చిబౌలి నానక్రాంగూడ వేవ్రాక్ సమీపంలో ఐదున్నర ఎకరాల్లో ట్విన్ టవర్స్ నిర్మిస్తున్నది. 854 కుటుంబాలు అత్యంత సౌకర్యంగా నివాసం ఉండేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ.1000 కోట్ల పెట్టుబడితో ‘ద ఒలింపస్’ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని సుమధుర గ్రూప్ చైర్మన్ జీ మధుసూదన్, వైస్ చైర్మన్ కేవీ రామారావు తెలిపారు.
‘ద ఒలింపస్’ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా గురువారం నగరంలోని ఓ హోటల్లో రామారావుతో కలిసి మధుసూదన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నారైలు, బహుళజాతి సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. రియల్రంగం గణనీయ వృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. కమర్షియల్, రెసిడెన్షియల్ అమ్మకాలకు డిమాండ్ నెలకొన్నదని పేర్కొన్నారు. ఆకాశహార్మ్యాలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని తమ సంస్థ వేవ్రాక్ సిటీ సెజ్ సమీపంలో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నదని వివరించారు. 20 లక్షల చదరపు అడుగులను విక్రయించనున్నామని తెలిపారు.
ప్రపంచ శ్రేణి సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 3 బీహెచ్కే, 3.5 బీహెచ్కే ఫ్లాట్లు.. 1,670 చదరపు అడుగుల నుంచి 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందించనున్నామని తెలిపారు. 50 వేల చదరపు అడుగులతో జీస్ పేరిట కబ్ల్హౌస్, కోవర్కింగ్, వర్కింగ్ స్పేస్లు, కేఫ్, లైబ్రరీ, స్విమ్మింగ్ఫూల్, బీబీక్యు టెర్రాస్, బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ గేమ్స్, స్పా, సెంట్రలైజ్డ్ ఏసీ.. ఇలా సమగ్ర జీవనశైలికి అనుగుణంగా ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు ఈజీ కనెక్టివిటీ, అతి సమీపంలోనే ఎన్నో ఎంఎన్సీలు ఉండటం, హైదరాబాద్ నగర అత్యద్భుత వీక్షణం, దవాఖానలు, ఔటర్ రింగురోడ్డు, విద్యాసంస్థలు, క్రీడా సదుపాయాలు, ఇతర సామాజిక మౌలిక వసతులు ఈ ప్రాజెక్టును మరింత ఆహ్లాదకరంగా మారుస్తున్నాయని తెలిపారు. వర్క్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆహ్లాదకర జీవితం కోరుకొనేవారి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దామని చెప్పారు.