నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారినుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు త్వరగా బయటపడాలని, భగవంతుడు ఆయనకు నిండునూరేండ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మంగళవారం పార్టీనేతలు, అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ, సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు, ప్రకటనలు చేశారు. దేశ, విదేశాల్లోనూ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు జరిపారు. సీఎం ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అర్చకులను కోరారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో అర్చకబృందం ప్రత్యేకంగా సుదర్శన నారసింహహోమం నిర్వహించింది. తెలంగాణ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సేవాసమితి సంయుక్తాధ్వర్యంలో ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించారు. అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వరంగల్లోని వేయిస్తంభాల గుడిలో భస్వ, కుంకుమ విలేపనంతో మహాన్యాసపూర్వక అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, మహా మృత్యుంజయజపం జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8వేల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని, ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయని ఉపేంద్రశర్మ తెలిపారు.
బుధవారం జరిగే శ్రీరామనవమి కల్యాణమహోత్సవం, పట్టాభిషేకం తదితర కార్యక్రమాల్లోనూ కేసీఆర్ గోత్రనామాలతో పూజలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. భద్రాద్రి సీతారామ చంద్రస్వామి దయ, కృపతో సీఎం కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్రావు ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో తిరిగి వస్తారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ దేవున్ని ప్రార్థించారు. కోట్లాది తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలతో సీఎం కోలుకోవాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి భగవంతుణ్ని వేడుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంగళవారం నాంపల్లి యూసుఫియాన్ దర్గాలో హోంమంత్రి మహమూద్ అలీ, వక్ఫ్బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీమ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ముడుపులు.. మృత్యుంజయ హోమాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఏడుపాయల వనదుర్గ్గా భవానీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్గల్ విద్యాధరిని క్షేత్రంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముడుపు కట్టారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లోని కాంచనగహలోని కురుమూర్తి రాయునికి ప్రత్యేకపూజలు చేశారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి ఆధ్వర్యంలో తార్నాకలోని లక్ష్మీగణపతి ఆలయంలో మృత్యుంజయహోమం జరిపించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త హైదరాబాద్లోని అంబర్పేట ఎల్లమ్మతల్లికి ముడుపుకట్టి పూజలు నిర్వహించారు. బషీరాబాగ్లోని కనకదుర్గ ఆలయంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి పూజలు చేశారు. భద్రకాళి ఆలయంలో ప్రధానార్చకుడు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మునుగోటి రమేశ్ పూజలు నిర్వహించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేట్ సెంట్రల్ వర్క్షాప్ వద్ద ఉన్న పెద్దమ్మతల్లి గుడిలో పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ ప్రతినిధి ఆదినారాయణ బృందం పూజలు చేసింది.
టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో..
కరోనా బారినుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆకాంక్షించారు. టీఆర్ఎస్ ఎన్నారై విభాగం 50 దేశాల శాఖల తరఫున భగవంతుణ్ణి ప్రార్థిసున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని న్యూజీలాండ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై న్యూజిలాండ్ అధ్యక్షుడు జగన్రెడ్డి వాడ్నలా పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి దీవెనలతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని టీఆర్ఎస్ సౌత్ఆఫ్రికా ఎన్నారై అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.
గొప్ప ఫైటర్..ఆరోగ్యంగా తిరిగివస్తారు
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కోరుకున్నారు. సీఎం ఆరోగ్యంగా తిరిగిరావాలని మాజీమంత్రి జే గీతారెడ్డి ట్విట్టర్లో ఆకాంక్షించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్, బీజేపీ నాయకులు మురళీధర్రావు, జితేందర్రెడ్డి ప్రార్థించారు. ‘కేసీఆర్ గొప్పఫైటర్, ఆయన ఆరోగ్యంగా త్వరలోనే తిరిగివస్తారు. తనకోసం మనం ప్రార్థనలుచేద్దాం’ అంటూ ప్రముఖనటుడు ప్రకాష్రాజ్ ట్వీట్చేశారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే సీఎం కేసీఆర్ను కరోనా ఏమీ చేయలేదని, ఆయన నిండునూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని షిర్డీ సాయినాధుడ్ని కోరుకుంటున్నానని సినీ నటుడు మోహన్బాబు ప్రకటించారు. కేసీఆర్ కరోనా బారినుంచి త్వరగా కోలుకోవాలని సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, డైరెక్టర్ అడవి శేషు, నటుడు శర్వానంద్, నిర్మాత బీఏ రాజు కోరుకున్నారు.
ప్రజలందరి దీవెనలతో..మాజీ గవర్నర్ నరసింహన్
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరలోనే కోలుకొని ప్రజాసేవలో నిమగ్నమవుతారని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యస్థితిపై వాకబుచేసిన ఆయన.. అందరి దీవెనలు, భగవంతుడి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు. కోట్లాది ప్రజల ఆదరాభిమానాలు, భగవంతుడి ఆశీస్సులున్న సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత ప్రార్థించారు.