హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకొంటే.. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకున్నది. సీఎం కేసీఆర్ చొరవ, పట్టుదల కారణంగానే ఇది సాధ్యమైంది. జాతీయ సగటు కంటే అధికంగా అనుమతులు సాధించుకోవడమే కాకుండా, వాటి నిర్మాణంలోనూ అదే ఊపు కనిపిస్తున్నది. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ నాలుగు, ఆరు లేన్లతో నిగనిగలాడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో జాతీయ రహదారుల నిడివి 2,511 కిలోమీటర్లే. ఇప్పుడు ఇవి 4,626 కిలోమీటర్లు. ఈ ఏడాది చివరినాటికి మరో 417 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేయించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ రోడ్లు యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో 100 చదరపు కిలోమీటర్ల ఏరియాకు 2.2 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి. ఇప్పుడు ఇవి 4.13 కిలోమీటర్లకు విస్తరించడం విశేషం. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. జాతీయస్థాయిలో 100 చదరపు కిలో మీటర్ల ఏరియాకు 4.06 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులున్నాయి.
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 4,626 కిలోమీటర్ల జాతీయ రహదారులు డిక్లరేషన్ కాగా ఇందులో 2,165 కిలోమీటర్లు ఆ స్థాయికి అభివృద్ధి చెందాయి. ఇందులో సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి చేసింది 831 కిలోమీటర్లే. మిగిలిన 1,334 కిలోమీటర్ల రహదారులను తెలంగాణ ఏర్పడిన తర్వాతనే పట్టుబట్టి, నిధులు సాధించి నిర్మించుకోవడం విశేషం. మరో 533 కిలోమీటర్లలో పనులు జరుగుతున్నాయి. 1,968 కిలోమీటర్ల పనులకు డీపీఆర్లు సమర్పించి, నిర్మాణ అనుమతులు తెచ్చారు. ఈ పనులను త్వరలో చేపట్టనున్నారు.
దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 2,511 కిలోమీటర్ల జాతీయ రహదారులను డిక్లేర్ చేసింది. కానీ, వారు నిర్మించిన జాతీయ రహదారులు 831 కిలోమీటర్లే. వీటిలో ప్రధానంగా విజయవాడ- హైదరాబాద్- ముంబై, నాగపూర్- హైదరాబాద్- బెంగళూరు మినహా మరొకటి లేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దేశవ్యాప్తంగా కనెక్టివిటీ పెరగాలంటే జాతీయ రహదారులను విస్తరించాలని భావించారు. అందుకు అనుగుణంగా డీపీఆర్లు రూపొందించారు. వాటికి ఎన్ని నిధులు, ఎంత భూమి అవసరమో లెక్కలేసి, పక్కా సమాచారంతో కేంద్రానికి వివరించారు.
సీఎం కేసీఆర్ స్వయంగా పలుసార్లు ప్రధాని మోదీని, ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో అధికారుల మీద ఒత్తిడి తెచ్చేలా ఎంపీల బృందాన్ని పురమాయించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని, జాతీయ రహదారులశాఖ కార్యదర్శి గిరిధర్ను కలిసి జాతీయ రహదారుల కోసం కృషి చేశారు. సీఎం కేసీఆర్ ప్రోద్బలంతో నిరంతరం కొనసాగించిన ప్రయత్నాలకు ఫలితం లభిస్తున్నది.
స్వరాష్ట్రంలో సాధించుకున్న జాతీయ రహదారులు (కిలోమీటర్లలో)
ఆర్థిక సంవత్సరం కిలోమీటర్లు
2015-16 120
2016-17 735.1
2017-18 462.98
2018-20 ఇవ్వలేదు
2020-21 796.75
మొత్తం 2,114.83
2014కు ముందు 2,511
మొత్తం 4,626
రాష్ర్టాభివృద్ధికి మంచి రోడ్లు ఉండాలని సీఎం కేసీఆర్ భావించారు. అనేక రోడ్లకు ట్రాఫిక్ ఫీజబులిటీ స్టడీ రిపోర్టులు చేయించారు. జాతీయ రహదారుల కోసం అనేక ప్రతిపాదనలు తయారు చేయించి కేంద్రాన్ని ఒప్పించారు. రాష్ట్రం వచ్చిన తర్వాతే 2,115 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులను సాధించుకున్నాం. దీంతో మొత్తం 4,626 కిలోమీటర్ల జాతీయ రహదారులు వచ్చాయి.
గణపతిరెడ్డి, రోడ్లు, భవనాలశాఖ ఈఎన్సీ