న్యూఢిల్లీ: నరాల సంబంధిత వ్యాధులు, నొప్పులతో బాధపడేవారు.. పెగ్రాబాలిన్(Pregabalin) మందును ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఆ డ్రగ్ను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పాపులర్ పెయిన్కిల్లర్ ప్రెగాబాలిన్ను షెడ్యూల్ హెచ్1 కేటగిరీలో చేర్చింది. ఈ హెడ్యూల్లో ఉన్న మందులు కొనాలంటే, కచ్చితంగా ప్రిస్క్రిప్షన్ కావాల్సిందే. ఫార్మసిస్టులు ఆ డ్రగ్కు చెందిన డాక్టరు చిట్టిని ఒకటి దగ్గర పెట్టుకోవాలని, ఆ తర్వాత ఆ డ్రగ్ వాడకం గురించి మూడేళ్ల వరకు పేషెంట్ వివరాలను సేకరించాలని కేంద్రం తన నోటిఫికేషన్లో తెలిపింది.
ప్రెగాబాలిన్ ట్యాబ్లెట్ వినియోగంపై పలు రాష్ట్రాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. ఆ డ్రగ్ను యువత దుర్వినియోగం చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రెగాబాలిన్ అమ్మకాలపై కఠిన ఆంక్షలు పెట్టడం అంటే బాధ్యతను పెంచడమే అని ప్రభుత్వం తెలిపింది. అక్రమ మార్గంలో ఆ మందును వినియోగించడాన్ని నియంత్రిస్తున్నట్లు చెప్పింది. డ్రగ్ దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను అడ్డుకునేందుకు కఠిన ఆంక్షలు పెట్టాల్సి వస్తుందని ఆరోగ్య శాఖ పేర్కొన్నది.
దీర్ఘకాలిక నొప్పులు, న్యూరోపథి, ఫిబ్రోమల్జియాతో పాటు నరాల సంబంధిత వ్యాధుల చికిత్స కోసం ప్రెగాబాలిన్ మందును డాక్టర్లు సూచిస్తారు. అయితే ఆ డ్రగ్ మార్కెట్లో చాలా పాపులర్. కానీ కొందరు దీన్ని తప్పుగా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా అక్రమ రీతిలో ప్రెగాబాలిన్ అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించామని ఆరోగ్య శాఖ తెలిపింది. ఉత్పత్తిదారులు ఆ డ్రగ్పై షెడ్యూల్ హెచ్1 వార్నింగ్ అని రాయాలని పేర్కొన్నది. ప్రస్తుతం షెడ్యూల్ హెచ్లో ప్రెగాబాలిన్ డ్రగ్ ఉన్నది. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఆ మందును ఫార్మసిస్టులు అమ్మాలని హెచ్ కేటగిరీ వెల్లడిస్తుంది. హెచ్1 కేటగిరీల స్ట్రాంగ్ యాంటీబయోటిక్స్, యాంటీ టీబీ డ్రగ్స్, హాబిట ఫార్మింగ్ మెడిసిన్స్ ఉంటాయి. యువత ఎక్కువగా ప్రెగాబాలిన్ మందును దుర్వినియోగం చేస్తున్నట్లు 2022లో పశ్చిమ పంజాబ్లో చేపట్టిన అధ్యయనం ద్వారా వెల్లడించారు.