రూ.1,040 కోట్లతో కోదాడ-ఖమ్మం రహదారి విస్తరణ
న్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణలో రూ.1,039.90 కోట్ల విలువైన రహదారి నిర్మాణ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు చెందిన అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (ఏఆర్టీఎల్) కైవసం చేసుకున్నది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నుంచి ఈ కాంట్రాక్టును పొందినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ‘భారత్మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా కోదాడ నుంచి ఖమ్మం వరకు 365ఏ నంబర్ జాతీయ రహదారిని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) పద్ధతిలో నాలుగు లేన్ల రహదారిగా మార్చేందుకు అవార్డు లెటర్ (ఎల్వోఏ)ను అందుకున్నట్లు తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం’ అని ఏఆర్టీఎల్ బుధవారం బీఎస్ఈకి సమాచారం అందిం చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యవధి రెండేండ్లని, నిర్వహణ వ్యవధి 15 ఏండ్లని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు ఎన్హెచ్ఏఐ నుంచి హెచ్ఏఎం, టీవోటీ (టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్) కింద ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ర్టాల్లో తాము దక్కించుకున్న రోడ్డు ప్రాజెక్టుల సంఖ్య ఎనిమిదికి పెరిగిందని ఏఆర్టీఎల్ వెల్లడించింది.
సోలార్ ప్రాజెక్టుల కొనుగోలు
మరోవైపు తెలంగాణలో 74.94 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) కొనుగోలు చేయబోతున్నది. షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ నుంచి రూ.446 కోట్లకు ఈ ప్రాజెక్టులను కొనుగోలు చేయబోతున్నట్లు ఏజీఈఎల్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల్లో 100 శాతం వాటాను కైవసం చేసుకునేందుకు షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఏజీఈఎల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2017లో మెదక్ జిల్లాలో ఏర్పాటైన ఈ ప్రాజెక్టులు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్తో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలనుకలిగి ఉన్నట్లు తెలిపింది.