హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో దొడ్డురకం ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని.. ఇకమీదట బాయిల్డ్రైస్ కొనబోమని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) చెపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వరికి గడ్డు పరిస్థితులు దాపురించే ప్రమాదం పొంచి ఉన్నదని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వం ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనబోమని కుండబద్దలు కొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టికి తీసుకువచ్చారు. పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు పలు అంశాలను వివరించారు. గత యాసంగిలో రాష్ట్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సీఎమ్మార్ను వెంటనే తీసుకోవాలని, తద్వారా వానకాలంలో ఉత్పత్తయ్యే ధాన్యం నిల్వకు స్థలం లభిస్తుందని ఇటీవల రాష్ట్రమంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు వివరించారని గుర్తుచేశారు. ఇప్పటికే ఐదేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు తమవద్ద ఉన్నాయని.. ఈ ఏడాది ఒక్క కిలోబాయిల్డ్ రైస్ను కూడా కొనబోమని కేంద్రమంత్రి కరాఖండీగా చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ పరిస్థితుల్లో వానకాలంలో 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనే పరిస్థితుల్లేవని పేర్కొన్నారు. కాళేశ్వరంతోపాటు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం.. రైతుబంధు సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి ప్రోత్సాహకాలతో తో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగిందని సమావేశం అభిప్రాయపడింది. కేంద్రప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి వ్యవసాయ ఎగుమతులను అంతర్జాతీయస్థాయిలో ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటుచేస్తే బాగుండేదని.. కానీ, అలాంటి చర్యలేవీ చేపట్టకపోవడంతో దేశంలో ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి నుంచి వరి వేయడమంటే రైతులు ఉరిపోసుకోవడమేననే అభిప్రాయం వ్యక్తమైంది.
గతేడాదే 2 వేల కోట్ల అదనపు భారం
గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని అధికారులు తెలిపారు. ఈ వానకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని, దీని ద్వారా సుమారు 1.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం రైస్ మిల్లుల్లో, గోదాముల్లో నిల్వ ఉన్నదని చెప్పారు. వీటిదృష్ట్యా పీడీఎస్ తదితర అవసరాల మేరకు, కేంద్రప్రభుత్వం నిర్ధారించి కోటా మినహా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో కరోనా సమయంలో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసిందని.. దీనివల్ల గత యాసంగిలో సుమారు రూ.2 వేల కోట్ల అదనపు భారం పడిందని అధికారులు వివరించారు. కానీ, ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని, వర్షాకాలంలో కేంద్రం నిర్ధారించిన 60 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
వీటన్నింటి దృష్ట్యా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగ, వేరు శనగ, పెసర, మినుము, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల వంటివి పండిస్తే రైతులకు లాభం చేకూరుతుందని సమావేశం అభిప్రాయపడింది. ఆ దిశగా రైతులను చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్నిస్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, సెక్రటరీలు స్మితా సబర్వాల్, రాజశేఖర్రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దొడ్డు రకం ధాన్యం కొనబోమని కేంద్రం కుండ బద్దలు కొట్టి చెప్తున్నది. వానకాలంలోనూ 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వరికి గడ్డుకాలం దాపురించింది. ఈ నేపథ్యంలో రైతులను వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలవైపు మళ్లించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది.
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగ, వేరు శనగ, పెసర, మినుము, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల వంటివి పండిస్తేనే అన్నదాతలకు మరింత లాభం చేకూరుతుంది. ఆ దిశగా రాష్ట్రంలోని రైతులందరినీ చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్నిస్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలి.