ఫ్లైయాష్ వినియోగంలో పర్యావరణ రక్షణకు గుర్తింపు
2020-21లో 16.86 లక్షల టన్నులు సరఫరా
ప్రధానంగా సిమెంట్ కర్మాగారాలకు రవాణా
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయాష్ను పూర్తిగా సద్వినియోగం చేసి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడినందుకుగాను సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగ సంస్థ అవార్డు లభించింది. గోవాలో మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ఈ అవార్డును సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం)డీ సత్యానారాయణరావుకు మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ డైరెక్టర్ మనోజ్కుమార్ అందించారు. 500 మెగావాట్లను మించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న థర్మల్ ప్లాంట్ల విభాగంలో సింగరేణికి ఈ అవార్డు లభించింది. ఎన్టీపీసీ, ఎస్సీఎల్ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు.. అదానీ, జేకే వంటి 150 వరకు ప్రైవేటు థర్మల్ ప్లాంట్లతో పోటీపడి సింగరేణి థర్మల్ కేంద్రం ఈ అవార్డును దక్కించుకొంది. దీనిపై సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్తోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ కేంద్రంలో వెలువడే ఫ్లైయాష్ను ప్రధానంగా సిమెంటు కంపెనీలకు రవాణా చేస్తున్నారు. 2020-21లో 16.86 లక్షల టన్నుల ఫ్లైయాష్ను సిమెంటు కంపెనీలకు రవాణా చేశారు. సింగరేణి నుంచి ఫ్లైయాష్ను తీసుకొనేందుకు తమిళనాడులోని ఏసీసీ (సిమెంట్స్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితోపాటు కేశోరాం, ఓరియంట్ తదితర 10 సిమెంటు కంపెనీలు సింగరేణి ఫ్లైయాష్ను వాడుతున్నాయి.