హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): తన ప్రాణం పోయినా.. దళితబంధు అమలును ఆపేది లేనేలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విస్పష్టంగా తేల్చిచెప్పారు. తెలంగాణను తేవడం కోసం ఎంత యజ్ఞంలా పనిచేశామో.. దళితబంధును విజయవంతంచేయడం కూడా మహాయజ్ఞంలా భావిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు పేదరికమే తప్ప కులం ప్రధానం కాదని చెప్పారు. ఏడాదికి రెండుమూడు లక్షల కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. తెలంగాణలో అంతరాలు లేని గొప్ప సమాజాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి నర్సింహులును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
అంతరాలు లేని ఒక గొప్ప సమాజం
తెలంగాణలో కులం మీద లెక్కతీస్తే అందరికన్నా పెద్ద కులం దళితులే. వాళ్లు 75 లక్షల జనాభా ఉన్నరు. అందరికన్నా తక్కువగా భూమి ఉన్నది వాళ్లకే. దళితుల దగ్గర 13 లక్షల ఎకరాలే ఉన్నది. అది కూడా సక్కగ ఉన్నదో లేదో తెల్వదు. ఎంతమంది కొట్టేశిన్రో.. అసోంటి దొంగల లెక్కలు తీస్తున్నరు. గిరిజనులు 9 శాతమే ఉన్నా, వారి దగ్గర 22 లక్షల ఎకరాలున్నది. ఇట్లా దళితుల జనాభా ఎక్కువ ఉన్నా, అవకాశాలు తక్కువ ఉన్నయి. అంబేద్కర్ పుణ్యమా అని రిజర్వేషన్లు పెట్టడం వల్ల కొందరు దళితుల పిల్లలు సదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొన్నరు. కొద్దిమంది రాజకీయనాయకులైనరు. అంబేద్కర్ బతికున్నన్ని రోజులు పేదలు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల గురించి మస్తు తండ్లాడిండు. అదేబాటలో ఇప్పుడు తెలంగాణ నడుస్తున్నది.
తెలంగాణ ఆర్థికంగా మంచిగున్నది కాబట్టి సాహసించి దళితబంధు చేపట్టినం. తెలంగాణ తేవడం ఎంత యజ్ఞమో, దళితబంధును సక్సెస్ చేయడం కూడా అంతే పెద్ద యజ్ఞం. పానంపోయినా దాన్ని వదలం. మనకు వనరులు ఉన్నకాడికి సంవత్సరానికి 2-3 లక్షల కుటుంబాల చొప్పున చేస్తం. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 100 మందికి వస్తది. వాసాలమర్రి కాకుండా ఆలేరు నియోజకవర్గంలో మరో వంద మందికి వస్తది. ఇట్ల చేయడం వల్ల తీసుకున్న డబ్బు ఎట్లా ఉపయోగపడుతదనేది తెలుస్తది. గ్రామాల్లో దళితులు, ఇతర వర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు దళిత బస్తీలల్ల కూర్చొని సంజాయించి చెప్పాలి. ‘చెడగొట్టుకోవద్దు.. ఫలితం రావాలె.. మన సీఎం ఇంత పట్టువట్టి చేసినప్పుడు విజయం కావాలె’ అని వివరించాలె. దళితబంధు సక్సెస్ అయితే రాష్ర్టానికి పేరొస్తది. అంతరాలు లేని గొప్ప సమాజం ఏర్పడుతది.
కన్నతండ్రి బాధ్యతల్లో ఉన్నం
దళితబంధు సబ్సిడీ కాదు. తమాషా కోసం చేసేది కాదు. ఓట్ల కోసం చేసేది అంతకన్నా కాదు. కొందరు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నరు. మనిషి అనంగనే ఓటు కనిపిస్తది. ఓటు ఎవరికి వేసేది ఉంటే వారికి వేస్తరు. ఇందులో పార్టీలు లేవు.. రాజకీయాలు లేవు. ఎవరు ఏ పార్టీలో అయినా ఉండనీ.. ఈ స్కీం లబ్ధిదారుడు దళితుడైతే చాలు. ఇంత పెద్ద ఆశయంతో, ఉదాత్తమైన ఆలోచనతో పెట్టుకున్న స్కీంలో గంత చిన్న ఏశం ఏస్తమా? వాసాలమర్రిలో 76 మంది దళితులు ఉంటే అందరికీ ఇచ్చినం. ఏ పార్టీలో ఉన్నరని పట్టించుకోలేదు. మనకు పెద్ద మనసు ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నాం.. కన్నతండ్రి బాధ్యతల్లో ఉన్నాం.. చిన్న విషయాలను సంకుచిత భావంతో పట్టించుకోకుండా యావత్ దళిత కుటుంబం బాగుపడాలె కాబట్టి అందరికీ ఇవ్వాలి. ఇది గొప్ప సామాజిక బాధ్యతతో అట్టడుగున ఉన్న సమాజ హితం కోసం పెట్టుకున్న గొప్ప కార్యక్రమం. దీనిని ఆరునూరైనా ముందుకు తీసుకెళ్లాలి. ఈ పథకంలో పైరవీలు అవసరం లేదు. గరీబ్సే గరీబ్ ఎవరైతే ఉన్నరో, వాళ్లకు మొదటగా ఇవ్వాలి. కొంచెం ఆలస్యమైనా మీకు కూడా వస్తదని ఇతర కుటుంబాలకు చెప్పాలి.
వాళ్లకు చేస్తవ్.. గీళ్లకు చేయవ్ అంటే ఎలా?
కొన్ని వర్గాలకు చేయాల్సిన అక్కెర ఉండే కాబట్టి చేసినం. గాళ్లకు చేస్తవ్ గీళ్లకు చేయ్యవా? అంటే సరికాదు. ఏం చేసినా కొన్ని కారణాలు ఉంటయి. మన రాష్ట్రంలో 30 లక్షలమంది కుర్మోళ్లు, గొల్లోల్లు ఉన్నరు. అయినా రోజూ 20 వేల జీవాలు మనకు దిగుమతి అవుతుండె. మనమే ఎగుమతి చేసే స్థితిలో ఉండాలన్న సంకల్పంతో రూ.11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించాం. ఇక్కడ యాదవులకు చేయడం కాదు ఇష్యూ. ఏది అక్కెర ఉంటే అది చేయాలి. గీత కార్మికులకు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 150 సొసైటీలు రద్దుచేశారు. ఆ సొసైటీల్లో దాదాపు లక్షా 50 వేలమంది బతుకుతరు. ఈ విషయాలు నాటి పాలకులకు తెల్వదు. మనకు తెలుసు కాబట్టి వెంటనే సొసైటీలను తిరిగి తెచ్చుకున్నం. వారి వృత్తి కాబట్టి బార్ షాపులు, వైన్స్లో రిజర్వేషన్లు పెట్టుకున్నాం. మనకు తెలంగాణ ప్రజల బతుకు ఏంది? ఇబ్బంది ఏంది? అక్కెర ఏంది? అనేది తెలుసు.
పరిచయం అక్కర్లేని పేరు మోత్కుపల్లి
మోత్కుపల్లి నర్సింహులుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అనేక ఏండ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక పాత్రలు పోషించారు. అనేక రకాలుగా సేవలందించడమే కాకుండా అట్టడుగు వర్గాల వాయిస్ను ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా వినిపిస్తారు. నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఇతర పార్టీలకు రాజకీయం ఒక ఆట. టీఆర్ఎస్కు ఒక టాస్క్, ఒక యజ్ఞం. నర్సింహులు రాజకీయం కోసం టీఆర్ఎస్లో చేరలేదు. రాజకీయం ఆయనకేం కొత్త కాదు, నాకేం కొత్త కాదు. వెనుకబడ్డ ప్రజలకు న్యాయం జరగాలి. యావత్ తెలంగాణ ఒక్కటై బాగు చేసుకోవాలి. అందరికీ వర్తించేలా మౌలిక వసతులను కల్పించుకోవాలి. నీళ్లు, కరెంటు, మంచినీరు, రైతు బీమా, రైతుబంధు.. ఇలా కొన్ని ఏర్పాటుచేసుకున్నాం. చేనేత కార్మికులు సచ్చిపోవుడు లేదిప్పుడు. మొత్తం బంగారు వాసం పెట్టలే.. కానీ వాళ్లకు ఒక ధైర్యం వచ్చింది.
అప్పటి ముఖ్యమంత్రితో గొడవ పెట్టుకున్న
నర్సింహులు మొదటిసారి కరెంటు మంత్రి అయ్యారు. అప్పుడు ఒకసారి కలిసినప్పుడు మాట్లాడితే, లారీల కొద్దీ ట్రాన్స్ఫార్మర్లు పంచినా ఆలేరు కరువు ప్రాంతానికి సరిపోవట్లేదు అని మాట్లాడుకున్నాం. అట్లా 30 ఏండ్ల కింద కరెంటు కోసం ఎన్నో అవస్థలు పడ్డాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘ఇంక తెలంగాణకు పెట్టుబడులు రావు’ అన్నారు. ‘స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే అలా అంటే తెలంగాణకు వచ్చేవాళ్లు కూడా రారు. మీరు అట్లా మాట్లాడకూడదు’అని నేను ఆయనతోటి గొడవపడ్డాను.
పిడికెడు మందితోనే మొదలుపెట్టిన
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప ఇక్కడి ప్రజల జీవితాలు బాగుపడవు అని ఒక సంకల్పం తీసుకొని బయల్దేరిన. అప్పుడు నాతోటి పిడికెడు మంది మాత్రమే ఉన్నరు. ‘సార్ మన ప్రయాణం ఎటుపోతది? దీంతో ఏం జరుగుతది? అని వినోద్ నన్ను అడిగేవాడు. అప్పుడు నేను ఒక్కటే మాట చెప్పేవాణ్ని..‘వినోద్.. మనకు కూడా సమయం వస్తది. అది మన చిత్తశుద్ధి, పట్టుదలమీద ఆధారపడుతది. కచ్చితంగా ఒక సమయం వస్తది. అప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఒక దిక్కున నిలబడి.. నా తెలంగాణ నాకు కావాలని దేశాన్ని అడుగుతది. ఆ టైం వందశాతం వస్తది. తెలంగాణ కచ్చితంగా వస్తది’అని చెప్పిన. అట్లనే ముందుకు పోయినం. చివరకు తెలంగాణ సాధించాం. రాష్ట్రం వచ్చిననాడు చాలా విపత్కర పరిస్థితి ఉండె. ఎటు వైపు ప్రయాణం తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి. మంచినీళ్లకు, వ్యవసాయానికి, కరెంటుకు బాధలు.. తెలిసిన విషయాలు అర్థం చేసుకుంటూ, తెలియనివి మేధావులతో చర్చిస్తూ.. ఒక పద్ధతి ప్రకారం ముందుకు బయలుదేరినం. కొంతదూరం ముందుకు వచ్చినం.
రాష్ట్రం వచ్చినంక పక్కకు జరుగుదామనుకున్న
తెలంగాణ తెచ్చినంక నేను పక్కకు జరుగుదామని అనుకున్న. కానీ ‘నువ్వు ఎవ్వరికో అప్పజెప్తే ఏం చేస్తరో ఏమో. పక్కకు జరిగితే మంచిగుండది సుమా’ అని చాలామంది అన్నరు. అందుకే.. తిట్టేటోడు తిడుతడని రాష్ర్టాన్ని నెత్తికి ఎత్తుకున్న. చేసిన పనులన్నీ చెప్తే చాంతాడంత అయితది. గతంలో ఆడపిల్లలు ప్రసవానికి వస్తే అడ్డగోలు పైసలు వసూలు చేసేటోళ్లు. కేసీఆర్ కిట్ తెచ్చినంక పైసలు ఉల్టా ఇచ్చుకుంట ప్రసవం అయినంక సర్కారు బండిల తీసుకపోయి ఇంటికాడ దించిపోతున్నరు. ఒకప్పుడు రైతు సచ్చిపోతే పట్టించుకోలే. ఇయ్యాల పైరవీలు, దరఖాస్తులు లేకుండా రైతు ఖాతాల రూ.5 లక్షలు పడుతున్నయి. రైతుబంధు కింద రూ.15 వేల కోట్లు సీదా రైతుల ఖాతాల పడుతున్నయి. ఎవ్వనికీ ఏకాణా లంచం ఇచ్చేది లేదు.
ఒకప్పుడు రిజిస్ట్రేషన్కు పోతే యమలోకం పోయినట్టు ఉంటుండె. పైసలియ్యంది రిజిస్ట్రేషన్ కాకపోతుండె. అయినంక గూడా మ్యుటేషన్ కోసం మల్లా సదివించాల్సి వస్తుండె. ఇప్పుడు ఐదు నిమిషాలల్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయితున్నది. వచ్చినోళ్లు సీటీ కొట్టుకుంట ఇంటికి పోతున్నరు. భూమి రికార్డులు మునుపు వీఆర్వో దయ. నోరులేనోళ్లది, పేదోళ్లది ఎవ్వడు పడితే వాడు గుంజుకోవడం, రాత్రికి రాత్రే తలరాత మారిపోవడం వంటివి ఉండొద్దని తీసుకొచ్చిందే ధరణి. ఇప్పుడు ధరణిలో నా భూమి ఎక్కితే మార్చే అధికారం ఎమ్మార్వో నుంచి సీఎం వరకు ఎవ్వరికీ లేదు. అమ్మితే కొంటెనో, దానం ఇస్తేనో (గిఫ్ట్), వారసులు పంచుకుంటే మాత్రమే భూమి మారుతది. ఇట్ల ప్రభుత్వం ప్రజల బాధలను తీర్చేందుకు అనేక కార్యక్రమాలు తెచ్చింది. వాటిని ముందుకు తీసుకపోవాల్సింది ప్రజలే. ఎవరికి వారు కథానాయకులైతే సమాజంలో మంచి ఫలితాలు వస్తయి. ఇంకా కొన్ని దుర్మార్గాలు ఉన్నయి. వాటిమీద కూడా కొట్లాడాల్సి ఉన్నది.
మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే…
రాష్ర్టానికి మోత్కుపల్లి నర్సింహులు సేవలు ఉపయోగపడుతాయి. అనుభవమున్న వ్యక్తి కాబట్టి ఆయన సేవలను ఉపయోగించుకుంటాం. ఈ రోజు చాలా మంచి రోజు. మేమిద్దరం చాలా సన్నిహితంగా పని చేసిన మిత్రులం. మా ఆలోచనలు ఒకేరకంగా ఉంటాయి. పేదల గురించి, సమాజం గురించి, బాధితుల గురించి ఒకేరకంగా ఆలోచిస్తాం. గ్రామాల నుంచి, మీ నుంచి ఎంత బలమైన సపోర్ట్ దొరికితే అంత బలంగా మందుకు పోతాం.
బలం పెరుగుతూనే ఉన్నది..
తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన దేవుడు కూడా దేవుడు కాలేదు. మన నదులు నదులు కాలేదు. మనుషులు మనుషులు కాలేదు. తెలంగాణ వచ్చినంక ముఖం తెలివైంది.. అయిందా? లేదా? ఇంకా కష్టపడితే ఇంకా బాగైతది. ఇంతకు ముందు నేనొక్కడినే కొట్లాడిన. ఆ తర్వాత కొందరు వచ్చిండ్రు. ఇప్పుడు నర్సన్న వచ్చిండు. మీరందరు వచ్చిండ్రు. బలం పెరుగుతూనే ఉన్నది. ఈ శక్తిని ఇంకా పెంచుకొంటూ మనవాళ్లకు మనం సేవ చేసుకొంటూ.. ఆనందం పొందుకొంటూ ముందుకుపోతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొంటున్నం. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు సక్కగ పని చేయ్యలేదు. సమస్యను అట్లనే ఉంచినయి. యాదగిరిగుట్ట గొప్ప పుణ్యక్షేత్రం. అక్కడ గొప్పగా గుడి కట్టుకున్నం. రేపే నేను అక్కడికి పోతున్న. దాన్ని ప్రారంభించుకోవాలె. ఇంకా ఏమైనా మంచి చెడ్డలు ఉంటే సరిచేస్తాం. అక్కడి ఎమ్మెల్యేతోపాటు అందరూ బాగా కష్టపడుతున్నరు. ఈ రోజు యాదగిరి గుట్టను చూస్తే కండ్లనిండా సంతోషమైతది. అక్కడికి పోయినవాళ్లంతా ఇది ప్రపంచంలోనే అద్భుతమైన పుణ్యక్షేత్రమని కొనియాడుతున్నరు. ఇలా అన్నింటినీ మంచిగా చేసుకుంటా పోతున్నం.
రక్షణగా.. రక్షణ నిధి
దళితబంధు పథకం పర్యవేక్షణకు అన్నిస్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఉంటాయి. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దళితబంధు కమిటీలు ఉంటాయి. కింది నుంచి మీదివరకు దళిత బ్రిగేడ్ ఉంటది. రూ.10 లక్షలు ఇచ్చి టాటా చెప్పి ఊరుకోం. వాళ్లు పైకి వస్తున్నరా లేదా? అని నిరంతరం పరిశీలిస్తం. రూ.10 లక్షల్లో రూ.10 వేలు పక్కన పెట్టి దానికి ప్రభుత్వం మరో రూ.10 వేలు కలిపి దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తాం. ఓ కుటుంబానికి అనుకోని ఆపద వస్తే ఆ కుటుంబం మళ్లీ కిందికి పోకుండా రక్షణ నిధి నుంచి కొంచెం తీసి సాయం చేస్తరు. రేపు గిరిజన రక్షణ నిధి, బీసీ రక్షణ నిధి పెట్టుకుంటం. ఏ సెక్షన్కు అమలు చేసినప్పుడు ఆ సెక్షన్కు పెట్టుకుంటాం. రేపు ఇతర వర్గాలకు అమలు చేసేటప్పుడు కూడా గొప్పగా ఇంప్లిమెంట్ అయ్యే తీరుగ ఇందులో జరిగే తప్పులు, గుణపాఠాలు తెలుసుకొని మొత్తం తెలంగాణ సమాజానికి ఈ స్కీంను ఆదర్శంగా తయారు చేసుకుంటున్నాం.
ఈ యజ్ఞం ఆగదు
దళితబంధుతో మొదలైన బలహీన వర్గాలను బలోపేతం చేసే యజ్ఞం ఇక్కడే ఆగదు. గిరిజనులు, బీసీలు, ఈబీసీలకూ వస్తది. రాష్ట్ర ఖజానా నిండితే ఏం చేసుకుంటం? ఏదో ఒకరూపంలో ప్రజలకు పోవాల్సిందే. ఎక్కువ అక్కెర ఉన్న ప్రజల నుంచి మొదలుపెట్టినం. ఇంట్ల ఎవడన్న బక్కగ ఉంటే టానిక్ కొనుక్కురామా? ఇదీ అంతే. ఎవరైతే బలహీనంగా ఉంటరో, బాధల ఉంటరో వారిని ఆదుకోవాలి. వారిని నిలబెట్టి గీళ్లు నా ప్రజలు అని గర్వంగా కాలర్ ఎగిరేసి చెప్పాలి. అది గొప్పతనం. గాదరి కిశోర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం వాళ్లకు దళితబంధు డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. 30 లేదా 40 శాతం నిధులు విడుదల చేయాలని చెప్పినం. రెండుమూడు రోజుల్లో అక్కడికి నేనూ పోతా. ఈ కార్యక్రమం ఇక్కడే ఆపం. అన్ని వర్గాలకు విస్తరిస్తాం. బలమైన నాయకత్వం ఉంటనే ఇది సాధ్యం అయితది. సాధించుకున్న రాష్ట్రం బాగు చేసుకున్నా మనమే.. చెడగొట్టుకున్నా మనమే. తెలంగాణ దళిత సమాజం రేపు భారత దళిత సమాజానికే ఒక దారి చూపుతది. అంత పెద్ద పని జరుగుతది. అక్కడితో ఆగదు. ఆ తర్వాత గిరిజన సమాజం, బీసీ సమాజం, ఓసీలళ్ల బాపనోళ్లు, రెడ్లు, వెలమ ఇలా ఎవరైనా అందర్నీ ఆదుకుంటం. మాకు పేదరికమే లెక్క. పేదలందరు పైకి వస్తే అదే బంగారు తెలంగాణ. ముగ్గురికో, నలుగురికో బంగారం వస్తే కాదు. దళితబంధును ఎంత సక్సెస్ చేస్తమో, ఇతర వర్గాలకు అంతే సక్సెస్ చేస్తం.
టీఆర్ఎస్లో చేరిన మోత్కుపల్లి
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, భూపాల్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మోత్కుపల్లి నర్సింహులు తెలుగుతల్లి ఫ్రైఓవర్ వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, బషీర్బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్రావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి తన అనుచరులతో తెలంగాణభవన్కు ర్యాలీగా వెళ్లారు. మోత్కుపల్లితోపాటు జీ ముకుందరెడ్డి, సగరపు ప్రసాద్, చిరువేరు సుధాకర్రెడ్డి, కేవీఎల్ఎన్ రావు, మోత్కుపల్లి రత్నాకర్రావు, క్రాంతి వినయ్కుమార్, నిమ్మారెడ్డి వెంకట్రెడ్డి, కందుకూరి నాగార్జున, జరిపోతుల శోభ, కాసర్ల లింగం, మహమ్మద్ సలీమ్ టీఆర్ఎస్లో చేరారు.
ఏడేండ్లలో రూ.23 లక్షల కోట్లు
వాసాలమర్రి, హుజూరాబాద్లో దళితబంధు లబ్ధిదారులు సంతోషంగా ఉన్నరు. ఓ లబ్ధిదారుడిని రూ.10 లక్షలిస్తే ఏం చేస్తవ్ అని అడిగితే ఇంకో ఇద్దరికి నౌకరీ ఇస్తా సర్ అని చెప్పిండు. నిజంగనే డబ్బులు ఇస్తే సెంట్రింగ్ సేఠ్ అయిపోయి ఇద్దరికి పని ఇచ్చిండు. ఈ పథకానికి మొత్తం రూ.1.7 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతామని అంచనా. ఇన్ని పైసలు యాడికెళ్లి పెడుతవ్ అంటున్నరు. తెలంగాణ కోసం పనిచేస్తే అప్పుడు గిట్లనే అన్నరు. యాడికెళ్లి తెస్తవ్ అని. దమ్ము కావాలె. ధైర్యం కావాలె. రాబోయే ఏడేండ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు రూ.23 లక్షల కోట్లు. ఇందులో రూ.1.7 లక్షల కోట్లు ఎంత? చేద్దామనే నియత్ ఉంటే అది ఓ లెక్కనా? ఇప్పుడు పెడుతున్న రూ.1.7 లక్షల కోట్లు రాష్ర్టానికి రూ.10 లక్షల కోట్లు సంపాయిస్తయి. దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటరు.
నెలకు రూ.60 వేల సంపాదన..
వాసాలమర్రి కాడ లక్ష్మమ్మ అనే ఆమె ఉంటది. పోయినసారి నా పక్కన కూసోని తిన్నది. ఆమె పరిస్థితి మొత్తం చెప్పింది. నేను మళ్లీ వచ్చిన నాడు మీ ఇంటికి వస్త అని చెప్పిన. అన్నట్టే పోయిన. నేను వస్తున్న అని మేడ్చల్లో ఉండే వాళ్ల బిడ్డ, అల్లుడిని పిలుచుకున్నది. దళితబంధు మీద మేడ్చల్ దగ్గర చర్చ జరుగుతున్నదా? అని అడిగిన. ఏం చేద్దామనుకుంటున్నవ్ అని అడిగితే తడబాటు పడ్డడు. ఆ పొళ్ల మోచేయితోని గుద్దింది. బావా నువ్ లేత్ మిషన్ల పని చేస్తున్నవ్ అదే పెట్టుకుంటా అని సారుకు చెప్పు అన్నది. లేత్ మిషనే పెడుతా అన్నడు. ఎంత వస్తదంటే రోజుకు కనీసం రూ.1,500-2,000 సంపాదిస్తా అని చెప్పిండు. వచ్చిన పని, అనుభవం ఉన్న పని పెట్టుబడి పెట్టి చేస్తే నెలకు రూ.60 వేలు సంపాదించవచ్చు. ఇంకేం కావాలె మనకు అంతకంటే? పరిపాలన చేసే పెద్దలకు ఇలాంటి ఫలితాలే కదా కావాల్సింది.
వల్ల కాడులా తయారైన ఊర్లు..
ఉండబుద్ధయ్యేలా తయారైనయి మొన్న నేను పొలం దగ్గర ఉన్న. ఒకాయన వచ్చి చెప్పిండు.. ‘సార్ హైదరాబాద్ నుంచి జనం ఊళ్ల తోవ పట్టిండ్రు.. వాహనాలన్నీ లైన్లు కట్టినయ్’ అని. ఒకప్పుడు వల్లకాడులా ఉండే ఊర్లు ఇప్పుడు మళ్ల ఉండబుద్ధయ్యేలా తయారైనయ్. పాత ఇండ్లన్నీ సదురుకుంటున్నరు. కరెంటు మంచిగ ఉంటున్నది. మంచినీళ్లు వస్తున్నయ్. పచ్చగ చెట్లు కనిపిస్తున్నయ్. చెరువులు అలుగు దుంకుతున్నయ్. పంటలు మంచిగ పండుతున్నయ్. చాపలోళ్లు చాపలు పట్టుకుంటున్నరు. గొల్లోళ్లు గొర్లు కాసుకుంటున్నరు. గ్రామాలన్నీ ఒక రీతికి వస్తున్నయ్. ఎవరి బతుకు వాళ్లు గౌరవంగా బతికే పరిస్థితి వస్తున్నది. ఒకప్పుడు హైదరాబాద్లో ఉండెటోళ్లు ఊర్లకు వెళ్లాలంటే ఇష్టపడేటోళ్లు కాదు. అట్లాంటిది ఇప్పుడు వేలల్లో కార్లు, బండ్లు ఊర్లబాట పట్టినయి. అంతా సంతోషంగా గ్రామాలకు పొయ్యి దసరా పండుగ చేసుకొని వస్తున్నరు. ఊర్లల్ల నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేటోళ్లతోటి మళ్లా రోడ్లన్నీ జామ్ అయితున్నయ్.
చంపేస్తం అని భయపెట్టిండ్రు
తెలంగాణ ప్రజల సమస్యలన్నింటికీ పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే అని అనుకున్నా. కానీ, అప్పట్లో ఎవ్వరికీ ధైర్యం ఉండేది కాదు. నేను ఉద్యమం మొదలు పెట్టినప్పుడు చాలా మంది ‘నువ్వు తెలంగాణ కోసం బయలెల్లినవు కానీ నిన్ను సంపేస్తరట’అని చెప్పి భయపెట్టేటోళ్లు. ‘సంపితే సంపుతరు.. అంతకంటే ఏం చేస్తరు ’అని చెప్పేవాడిని. అట్లా విచిత్రమైన పరిస్థితుల్లో తెలంగాణ సమాజాన్ని ఉంచి వారి ఇష్టారీతిన వ్యవహరించిండ్రు. ఒకప్పుడు ఆలేరు, జనగామ, భువనగిరి దగ్గర భారీగా మంచినీళ్ల వ్యాపారాలు జరిగేవి. ఒక్క జనగామలోనే 50 నుంచి 60 ఆర్వో ప్లాంట్లు ఉండేవి. ఆలేరు పట్టణంలో 25 వరకు ఉండేవి. ఇట్లా ఆనాడు మంచినీళ్లు కూడా కొనుక్కుని తాగే భయంకరమైన పరిస్థితి ఉండేది. మంచినీళ్లు రావు, కరెంటు రాదు. ఇక వ్యవసాయం సంగతి చెప్పే పరిస్థితే లేదు. గూడు చెదిరిన బిడ్డల్లాగా ఎక్కడోళ్లం అక్కడ చెల్లాచెదురై ఆగమాగమై పోయినం. ఆ పరిస్థితుల్లో కూడా నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పడు కొన్ని విషయాల్లో కొట్లాడి చేసినం. కొన్ని చేయలేకపోయినం. ఏప్రయత్నం చేసినా పరిష్కారం కనిపించకపోయేది.
కేసీఆర్ లాంటి గొప్ప సీఎంను చూడలేదు
తెలుగు యూనివర్సిటీ: తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశానని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లాంటి గొప్ప వ్యక్తిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం గన్పార్కువద్ద మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్తో కలిసి పనిచేయాలనే సంకల్పంతోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్టు చెప్పారు. ప్రతి వర్గానికి అండగా ఉన్న కేసీఆర్ వంటి వ్యక్తిని తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. మోత్కుపల్లి వెంట ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులున్నారు.
ఓసారి ములుగుకు పోతే ఓ లంబాడాయన వచ్చి మీదపడి ఏడ్శిండు. ఏమైందని అడిగితే ‘శ్రీరామనవమి తర్వాత బిడ్డ పెండ్లికని పైసలు దాశిపెడితే ఇల్లు కాలిపోయింది. ఇగ నేను బతుక.. ఉరివెట్టుకుంట’ అని ఏడుస్తనే ఉన్నడు. ఆయినెను సముదాయించి రూ. లక్ష పట్టుకపోయి పెండ్లి చేయించినం. ఇటువంటి బాధలకెల్లి పుట్టిందే కళ్యాణలక్ష్మి
నర్సన్న సేవలు ఆలేరు మందమో. నల్లగొండ మందమో కాదు. ఆయనకు అనుభవం ఉన్నది కాబట్టి ఏ స్థాయిలో వాడుకోవాల్నో అదే స్థాయిలో వాడుకుంటం
– సీఎం కేసీఆర్