హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే తన లక్ష్యమని సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో, ఆర్టీసీని పేద ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. టీఎస్ఆర్టీసీకి తనను చైర్మన్గా నియమించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపా రు. బస్భవన్లో సోమవారం ఉదయం 9.15 గంటలకు బాజిరెడ్డి గోవర్ధన్ సంస్థ చైర్మన్గా ప్రమాణం చేశారు.
మంత్రులు మహమూద్అలీ, కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఇతర ప్రజాప్రతినిధు లు బాజిరెడ్డిని కలిసి అభినందించారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఇతర ఈడీలతో కలిసి మీడియాతో మా ట్లాడారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది సహకారంతో టీఎస్ఆర్టీసీని లాభాల్లోకి తెస్తామని చెప్పారు. ప్రస్తుతం సంస్థకు ప్రతిరోజూ రూ.13 కోట్ల ఆదాయం వస్తుంటే ఖర్చు రూ.18 కోట్ల వరకు ఉంటున్నదన్నారు. తాను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డానని, ఆర్టీసీ చైర్మన్గా కూడా సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించడాన్ని ఒక చాలెంజ్గా తీసుకుంటానని అన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అ త్యంత సురక్షితమని, ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణించవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
కేంద్రంలా ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదు
కేంద్ర ప్రభుత్వంలాగా టీఎస్ఆర్టీసీకి చెందిన ఆస్తులను విక్రయించడం గానీ లేదా లీజుకు ఇవ్వడంగానీ చేయబోమని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని కాపాడే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రూట్లలో 95శాతం మేర బస్సులను తిరిగి నడుపుతున్నామని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రజలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ బస్భవన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బస్భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ)పురుషోత్తం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్మోహన్రావు, చీఫ్ ఇంజినీర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ మరింత చేరువ కావాలి: కవిత
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో, టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. బాజిరెడ్డి గోవర్ధన్ను బస్భవన్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం కల్పించిన సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజల తరఫున ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.