హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శనివారం సెలవు మంజూరుచేస్తూ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. రెండో శనివారం కావడంతో ఈ సెలవును మంజూరుచేశారు. గతంలో పాఠశాలల పునఃప్రారంభ సమయంలో జారీచేసిన విద్యా క్యాలెండర్లో స్కూళ్లన్నీ రెండో శనివారాలు సైతం నడుస్తాయని పేర్కొన్నారు. ఈ లెక్కన ఫిబ్రవరి, మార్చిల్లో రెండో శనివారాలు సైతం పాఠశాలలు తెరిచి ఉండగా, తరగతులను నిర్వహించారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలను మూసివేయడంతో ఈ రెండో శనివారాన్ని సెలవుగా ప్రకటించారు. శనివారం టీచర్లంతా ఇండ్లవద్దే ఉంటూ ఫోన్లు, యూట్యూబ్ చానళ్లు, వాట్పాప్ ద్వారా విద్యార్థుల అభ్యసనను పర్యవేక్షించాలని ఈ ఆదేశాల్లో స్పష్టంచేశారు.