హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా లక్షణాలుండి, ర్యాపిడ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా వ్యాధిని నిర్ధారించేందుకు ఇతర పరీక్షలు కూడా ఉన్నాయని కింగ్కోఠి దవాఖాన నోడల్ అధికారి డాక్టర్ మల్లికార్జున్ చెప్పారు. సరైన పద్ధతిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చని భరోసా ఇచ్చారు. కరోనా లక్షణాలు, శరీరంలో వైరస్ ప్రభావం, వ్యాధి తీవ్రతను గుర్తించడంపై ఆయన నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
లక్షణాలుంటే ఏ పరీక్షలు చేయించుకోవాలి?
ఇప్పుడు కరోనా లక్షణాలు అందరికీ తెలుసు. చాలామందికి రుచి, వాసన తెలియదు. కొందరిలో దగ్గు, ఆయాసం ఉంటుంది. కొందరు జ్వరంతో వస్తారు. అప్పుడప్పుడూ నీళ్ల విరేచనాలవుతుంటాయి. కొన్ని కొత్త లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. ఎవరైతే కరోనా పేషెంట్ దగ్గరలో ఉంటారో.. వాళ్లకు రుచి, వాసన తెలియకపోతే.. అది కరోనా అనుకొని మొదట ర్యాపిడ్ టెస్ట్ చేయించాలి. అందులో పాజిటివ్ వస్తే వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఒకవేళ నెగెటివ్ వచ్చి.. లక్షణాలు ఉన్నపుడు ఆర్టీపీసీఆర్ చేయించాలి. జ్వరం రోజుల కొద్దీ ఉండి కరోనా సోకిందన్న అనుమానం ఉంటే.. ఆ సమయంలో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా, సీబీపీ, సీఆర్పీ, డీడైమర్ టెస్ట్లను, దగ్గు తీవ్రంగా ఉన్నపుడు హెచ్ఆర్సీటీ చేయించుకోవాలి.
వైరస్ సోకినా నెగెటివ్ ఎందుకు వస్తుంది?
ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అప్పుడప్పుడు నెగెటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైరస్ ముక్కులో గానీ, నోట్లో గానీ లేకుంటే ఈ టెస్టులు చేసినప్పుడు పాజిటివ్ రాదు. వ్యాధి లక్షణాలు అధికంగా ఉండి న్యుమోనియా ప్రభావం వ్యక్తి శరీరంలో ఉంటే వైరస్ ప్రభావాన్ని పరోక్షంగా తెలుసుకొనేందుకు ఇతర పరీక్షలు చేస్తారు. బ్లడ్ టెస్ట్ సీబీపీ, సీఆర్పీ (సీ రియాక్టివ్ ప్రొటీన్)తోపాటు డీ డైమర్ అనే పరీక్ష చేస్తారు. దాంతోపాటు సీరమ్ ఫెరటిన్, ఐఎల్6 (ఇంటర్ల్యూకిన్6), ఎల్డీహెచ్ పరీక్షల ద్వారా మనిషి శరీరం లో వ్యాధి తీవ్రతను పరోక్షంగా గుర్తించి వైరస్ బారిన పడినట్టు నిర్ధారిస్తారు. సీరమ్ ఎల్డీహెచ్ పరీక్షల ద్వారా కూడా కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు. డీ డైమర్ పరీక్ష కూడా చాలా అవసరం. దీనిద్వారా వ్యక్తి శరీరంలో రక్తం గడ్డ కట్టడాన్ని గుర్తిస్తారు. న్యుమోనియా పేషెంట్లలో రక్త గడ్డలు తయారైనట్లు పరోక్ష సంకేతం ఉంటే వారికి రక్తం కరిగించే హెపారిన్ వంటి ఇంజెక్షన్లు ఇవ్వొచ్చు.
వ్యాధి తీవ్రత తగ్గుతున్నట్టు ఎలా గుర్తిస్తారు?
ఐఎల్6, సీఆర్పీ, డీ డైమర్ లెవల్స్ తగ్గుతున్నాయంటే మనకు వ్యాధి తగ్గుతున్నట్లు. కాబట్టి.. రక్త పరీక్షలు సీబీపీ, సీఆర్పీ, డీ డైమర్, ఐఎల్6 వంటి నిర్ధారణ పరీక్షలను వైద్యసేవలు పొందాక నిర్ణీత సమయంలో వైద్యుల సూచన మేరకు చేయిస్తే కరోనా వ్యాధి తీవ్రత తగ్గిన విషయాన్ని తెలుసుకోగలుగుతాం.
కరోనా సోకినవారిలో షుగర్ పెరుగుతుందంటారు నిజమా?
సాధారణంగా కరోనా వచ్చిన వాళ్లకు షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనికి రెండు కారణాలు. ఒకటి కరోనా వల్ల, రెండోది కరోనా రోగులకు ఇచ్చే స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ల వల్ల. వ్యాధి నుంచి కోలుకున్నా కూడా కొందరిలో 7- 10 రోజులవరకు షుగర్ ప్రభావం అధికంగా ఉంటుంది. అటువంటివారికి సరైన వైద్యం అందించాలి. కొంతమందికి వారిలో తీవ్రతను బట్టి మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా షుగర్స్థాయి నిలకడగా ఉండేలా చూడాలి.
కరోనా వల్ల శారీరక బలహీనత వస్తే ఎలా?
కరోనాకు చికిత్స పొంది, వ్యాధి నయమైనా కొందరిలో శారీరక బలహీనత ఉంటుంది. అటువంటి వారు వైద్యుల సూచనతో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, సీ, డీ విటమిన్ ట్యాబ్లెట్లు వాడి బలాన్ని పెంచుకోవాలి. భోజనంలో కూడా ఎక్కువగా ప్రొటీన్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవాలి. దీనివల్ల పేషెంట్ రోగనిరోధకశక్తి పెరిగి వారు వేగంగా కోలుకొని, తమ పనులు చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మీరిచ్చే సూచనలు..
కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కలిసి ఉం టే.. జ్వరం, ఇతర లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి. జలుబు, ఒళ్లు నొప్పులు, దగ్గు ఉండ టం, రుచి, వాసన తెలియకపోవడం వంటివి ఉంటే తక్షణం ప్రభుత్వ దవాఖానల్లో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ఈ టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా.. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుని సంప్రదించి ప్రభుత్వం అందించే కరోనా కిట్ను వాడండి. మీలో నీర సం, శ్వాసలో ఇబ్బంది, ఆయాసం ఉన్నపుడు మాత్రం.. హెచ్ఆర్సీటీ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. పల్స్ ఆక్సీమీటర్తో ఆక్సిజన్ శాచురేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. శ్వాస ఇబ్బందులు తీవ్రంగా ఉంటే మీ సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చి వైద్యం చేయించుకోవాలి. కరోనా ప్రాణాంతక జబ్బుకాదు. ముందుగా గుర్తించగలిగితే వేగంగా దాన్నుంచి కోలుకోవచ్చు. కరోనా సోకడాన్ని తప్పుగా భావించొద్దు.. ఆ వ్యాధిపై వ్యతిరేక భావాలు వదిలేసి.. జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగిందని ఎలా గుర్తిస్తారు?
ఊపిరితిత్తుల్లోకి ఒకసారి కరోనా వైరస్ వెళ్లినపుడు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడిచినపుడు, బాత్రూమ్కు వెళ్లినపుడు.. ఏదైనా పనిచేస్తున్నపుడు ఆయాసం వస్తుంది. దాంతోపాటు రోగిలో పొడిదగ్గు, లేదా తెమడతో కూడిన దగ్గు ఉంటుంది. కొందరిలో దగ్గినప్పుడు అరుదుగా రక్తం కూడా వస్తుంది. అటువంటి వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రతను గుర్తించేందుకు వెంటనే హెచ్ఆర్సీటీ (హై రెజల్యూషన్ సీటీ స్కాన్) చేయాలి. దీని ద్వారా పరోక్షంగా లంగ్స్లో ఇన్ఫెక్షన్ తెలుస్తుంది. దీంతోపాటు పల్స్ ఆక్సీమీటర్ చాలా ఉపయోగకరం. దాని ద్వారా మనం ఆక్సిజన్ లెవల్స్ చూసుకోవాలి. అది కూడా మనకు 95 కంటే తక్కువగా ఉంటే.. సీటీ స్కాన్లో కూడా తేడాలుంటే.. న్యుమోనియా వచ్చిందని, కరోనా వల్ల మనలో ఇన్ఫెక్షన్ పెరిగిందని గుర్తించాలి. వ్యాధి నుంచి కోలుకున్నా కూడా కొంతమందిలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోదు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్నవారిలో లంగ్స్ పూర్తిగా దెబ్బతినడంతో చాలారోజుల వరకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అటువంటి వారు పల్మనాలజిస్ట్ల సలహాతో శ్వాస సమస్యను అధిగమించే విధానాలను పాటించాలి.
ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేస్తున్నారా?
కరోనా ఉన్నదని అనుమానాలుంటే నిర్మొహమాటంగా ప్రభుత్వ దవాఖానలకు వచ్చి పరీక్షలు చేయించుకోండి. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్.. బ్లడ్ టెస్ట్ అలా.. ఏ టెస్ట్ అవసరమైనా సంపూర్ణంగా ప్రభుత్వ దవాఖానలో చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. కరోనా లక్షణాలు ఏవి బయటపడినా.. వైద్యారోగ్యశాఖ ద్వారా అందిస్తున్న కరోనా కిట్లోని మందులను వైద్యులు సూచించిన ప్రకారం కచ్చితంగా వాడి, ఆ వ్యాధి నుంచి బయట పడాలని రాష్ట్ర సర్కారు దిశానిర్దేశం చేస్తున్నది.