రంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల ఏర్పాటుకు వెనువెంటనే అనుమతులిచ్చేందుకు తీసుకొచ్చిన టీఎస్ ఐ-పాస్.. కరెంటు కోత అన్న పదమే వినపడకుండా పరిశ్రమలకూ 24 గంటలు సరఫరా.. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పారిశ్రామికరంగానికి నవశకం మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కులు, హార్డ్వేర్ పార్కులు, ఐటీ టవర్లు, మెగా ఉత్పత్తి పరిశ్రమలు తరలివచ్చాయి. దేశంలోనే ప్రముఖ పరిశ్రమలు వెల్స్పన్, క్రోనస్, టాటా, విజయ్నేహా, పోకర్ణ ఇంజినీర్ స్టోన్ పరిశ్రమ, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్ వంటివి తమ ప్లాంట్లను నెలకొల్పాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఏడేండ్లలోనే జిల్లాకు 21,507 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 3,647 పరిశ్రమలు ఏర్పాటయ్యా యి.
ఇప్పటివరకు 3,32,705 మందికి ఉపాధి దొరికింది. టీఎస్-ఐపాస్ విధానం అమల్లోకి వచ్చాకే జిల్లాకు రూ.19,028 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా గత ఏడేండ్లలో రూ.670 కోట్ల పెట్టుబడులతో 2,277 సూక్ష్మ తరహా పరిశ్రమలు, రూ.2,689 కోట్ల పెట్టుబడులతో 1,168 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 105 పెద్ద తరహా పరిశ్రమల ఏర్పాటుతో రూ.3,566 కోట్ల పెట్టుబడులు, 63 మధ్యతరహా పరిశ్రమలతో రూ.1,112 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. జిల్లావ్యాప్తంగా రూ.3,971 కోట్ల పెట్టుబడులతో 11 మెగా ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.9,765 కోట్ల పెట్టుబడులతో జిల్లాకు 33 మెగా ఇన్ఫ్రా(ఐటీ టవర్స్) ప్రాజెక్టులు వచ్చాయి. పారిశ్రామికరంగం అభివృద్ధితోపాటు ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. జిల్లాలోని చిన్న, మధ్య, భారీతరహా పరిశ్రమలతో 3,32,705 మందికి ఉపాధి లభించింది.
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తు
ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ కట్లు, విద్యుత్తు సరఫరా సరిగా లేక రోజుల తరబడి.. ఒక్కోసారి నెలల తరబడి కంపెనీలు మూతపడేవి. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో పారిశ్రామికరంగానికి మంచి రోజులు వచ్చాయి. పరిశ్రమలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తూ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పరిశ్రమలకు విద్యుత్తు సమస్య పూర్తిగా సమిసిపోయింది. పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసి పరిశ్రమలకు నిరంతరంగా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వేసవిలోనూ పరిశ్రమలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది, అయినా అనుమతి వస్తుందన్న గ్యారంటీ ఉండేది కాదు. కానీ టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోనే అనుమతులు వస్తున్నాయి. దీంతో ఔత్సాహికులు పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నారు.
పరిశ్రమలకు అనువుగా రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండటంతో ఏడేండ్లలో రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్తో 15 రోజుల్లోగా పరిశ్రమలకు అనుమతులు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా ఆసక్తి చూపుతున్నారు. వెల్స్పన్, అమెజాన్, టాటా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుచేశాయి. వీటితో చాలామంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది. సీఎం కేసీఆర్ పారిశ్రామికరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో..
ఓ భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఆరునెలల పైనే పట్టేది. అయినా అనుమతి వస్తుందన్న గ్యారంటీ లేదు.
తెలంగాణలో..
ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా టీఎస్-ఐపాస్తో పదిహేను రోజుల్లోనే అనుమతి వచ్చేస్తున్నది.
అప్పుడు..
పరిశ్రమలకు పగలు 2 గంటలు, రాత్రి 2 గంటలు అధికారికంగా కరెంటు కట్ చేసేవారు. అనధికారికంగా రోజుకు ఆరేడు గంటలు కరెంట్ కోతలు! వేసవిలో అయితే పవర్ హాలిడేలతో కంపెనీలను మూసుకోవాల్సిన దుస్థితి.
ఇప్పుడు..
తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి పరిశ్రమలకు నిరంతరంగా సరఫరా చేస్తున్నది. వేసవిలోనూ 24 గంటలపాటు విద్యుత్తు అందిస్తున్నది.
ప్రభుత్వ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలతో రాష్ర్టానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. అందుకు నిదర్శనమే రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతి.