హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ దవాఖానను మరోసారి పూర్తిస్థాయిలో కొవిడ్ చికిత్సకే కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం నుంచి ఔట్పేషెంట్ (ఓపీ)సేవలను నిలిపివేయనున్నారు. సాధారణ కేసులను తీసుకోకుండా అత్యవసర చికిత్స అవసరమైనవారిని చేర్చుకొని సేవలు అందించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారిత తర్వాత మరో దవాఖానలకు మార్చాలని వైద్యులకు ఆరోగ్యశాఖ సూచించింది. ఇప్పటికే సాధారణ చికిత్స పొందుతున్నవారిని ఉస్మానియాకు, ప్రసూతి సేవలను పేట్లబుర్జు, సుల్తాన్బజార్ ప్రసూతి దవాఖానలకు తరలించి ఆ పడకలను కొవిడ్ బాధితులకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. బాధితులను ఆన్ని వార్డుల్లో చేర్చుకోవాలని గాంధీ హెచ్వోడీలను ఆదేశించింది. డ్యూటీ రోస్టర్ విధానాన్ని రూపొందించుకొని 24 గంటలపాటు సేవలను అందించాలని, అన్ని డిపార్ట్మెంట్లు కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరంగా సేవలు అందించాలని పేర్కొన్నది. ఇప్పటికే గాంధీలో 450కి పైగా కరోనా బాధితులు ఉన్నారు. గురువారం ఒక్క రోజే 150 మంది చేరారు. ప్రతి 10 నిమిషాలకు ఒక బాధితులు గాంధీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పడకలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గాంధీలో శుక్రవారం నాటికి మొత్తం 1,890 పడకలు ఉండగా, 424 బాధితులు చికిత్స పొందుతున్నారు. 1,466 పడకలు ఖాళీగా ఉన్నట్టు హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. గాంధీలో ప్రస్తుతం దాదాపు 36 విభాగాలను కొవిడ్ కేంద్రాలుగా మార్చి సేవలందించనున్నారు.
కరోనా బాధితులను వెంటనే చేర్చుకునేలా ఏర్పాట్లుచేస్తున్నాం.. గాంధీలో 1,800 పడకలు ఉన్నాయి. 500 వరకు ఐసీయూ ఉంటాయి. ఇప్పటికే అన్ని విభాగాల్లో కరోనా బాధితులకు పడకలు కేటాయించి సేవలందిస్తున్నాం. వెయింటింగ్లో లేకుండా పడకల సామర్థ్యాన్ని పెంచుకుంటూ సేవలను అందిస్తాం.