హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వయసుతో సంబంధం లేకుండా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. దాదాపు నాలుగు కోట్ల మందికి రూ.2,500 కోట్ల ఖర్చుతో వ్యాక్సినేషన్ చేపడుతామని కేసీఆర్ వెల్లడించారు. స్వరాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇకడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్నవారిని కలుపుకొంటే తెలంగాణలో సుమారు నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారని అంచనా వేశామన్నారు. వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా టీకా ఇచ్చామని సీఎం చెప్పారు. మిగిలిన వారందరికీ వయసుతో సంబంధం లేకుండా టీకా ఇవ్వాలని ఆదేశించారు. అందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యంకాదని, అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వైద్యశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకు అనుగుణంగా చర్యలు వేగంగా తీసుకోవాలని తెలిపారు.
స్వయంగా పర్యవేక్షిస్తా
ఇప్పటికే హైదరాబాద్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారుచేస్తున్నదని, రెడ్డీస్ ల్యాబ్తోపాటు మరికొన్ని సంస్థలు వ్యాక్సిన్ తయారీకి ముందుకొచ్చాయని, కాబట్టి ప్రజలకు వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండుమూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తర్వాత సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. టీకా కార్యక్రమం పటిష్ఠంగా, విజయవంతంగా అమలుచేయడానికి జిల్లాలవారీగా ఇంచార్జీలను నియమిస్తామని చెప్పారు.
భయపడవద్దు
వాక్సినేషన్తోపాటు, రెమ్డెసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందని చెప్పారు. ప్రజలను కొవిడ్ బారినుంచి కాపాడటానికి అన్ని చర్యలు తీసుకొంటుందని, పెద్ద ఎత్తున శానిటేషన్ చేపడుతుందని భరోసా ఇచ్చారు. ప్రజలు అధైర్యపడవద్దని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని సీఎం కోరారు.
గుంపులుగా గుమికూడకండి
పెద్దఎత్తున గుంపులుగా కూడవద్దని, ఊరేగింపుల్లో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్ఠంగా చేస్తుందని కేసీఆర్ మరోమారు చెప్పారు.
ప్రజల ఆరోగ్యానికి సీఎం అండ: ఎంబీసీ సంక్షేమ సంఘం
టీకా విషయంలో కేంద్రం మొండి వైఖరి చూపుతున్నా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ ఉచిత టీకా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయమని తెలంగాణ ఏంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ప్రజాపతి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
అద్భుత నిర్ణయం : మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి కొవిడ్ టీకా ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన నిర్ణయం తీసుకొన్నారని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొవిడ్ వంటి పరీక్షా సమయంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని దేశానికి సీఎం మరోసారి దిశానిర్దేశం చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగుకోట్ల మంది జనాభాలో ఇప్పటికే 35 లక్షల మంది టీకాలు తీసుకున్నారని, అన్ని వయస్సుల వారికి ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్ అద్భుతమైన నిర్ణయం తీసుకొన్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా కొనియాడారు.
భయపడవద్దు
వాక్సినేషన్తోపాటు, రెమ్డెసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకొంటున్నాం. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురి కావద్దు. కరోనా రోగులకు పడకలు, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుంది. ప్రజలను కొవిడ్ బారినుంచి కాపాడటానికి అన్ని చర్యలు తీసుకొంటుంది. పెద్ద ఎత్తున శానిటేషన్ చేపడుతుంది. ప్రజలు అధైర్యపడవద్దు, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దు.
-ముఖ్యమంత్రి కేసీఆర్