హైదరాబాద్/సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్వర సర్వే బృందాలు ఇంటింటికీ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రతి ఇంటిలో పరిస్థితి తెలుసుకొని దానికి అనుగుణంగా వైద్యం అందించేలా ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నది. సర్వే సమయంలో ఎవరైనా జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే వారికి కొవిడ్ వైద్యం కూడా అందించాలని నిర్ణయించింది. ముందుగా జీహెచ్ఎంసీలో ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ సర్వే విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టాలని నిర్ణయించి అమలుచేస్తున్నది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టాయి.
ప్రతి ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు? వారిలో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని విచారణ చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన వివరాలన్నింటినీ కుటుంబాలవారీగా నమోదుచేసుకుంటున్నాయి. ఆయా కుంటుంబాల్లో ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకున్నారు? ఎవరు తీసుకోలేదన్న వివరాలను కూడా సేకరిస్తున్నట్టు తెలిసింది. ఎవరి ఇంట్లోనైనా జ్వరం, దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు ఉన్నవారు కనిపిస్తే వెంటనే వారికి తక్కువ లక్షణాలుంటే మెడికల్ కిట్ అందజేస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే దవాఖానకు రిఫర్ చేస్తున్నారు.
జీహెచ్ఎంసీలో విజయవంతం
గ్రేటర్ హైదరాబాద్లో మొదటగా జ్వర సర్వే బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు సోమవారం నుంచి జీహెచ్ఎంసీలో ప్రాంతాలవారీగా ఇంటింటికీ తిరిగి జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేశాయి. సోమవారం 393 బృందాలు ఇంటింటి సర్వే చేయగా, మంగళవారం 641 బృందాలు, బుధవారం 707 బృందాలు ఇంటింటికీ తిరిగాయి. గురువారం 700 బృందాలతో 47,582 ఇండ్లలో సర్వే జరిపారు. జీహెచ్ఎంసీలో సర్వే విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు గురువారం రంగంలోకి దిగి బృందాలను ఏర్పాటుచేసి సర్వే ప్రారంభించినట్టు తెలిసింది. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఇంటింటి సర్వే ప్రారంభించారు.
లక్షణాలుంటే అక్కడికక్కడే మెడికల్ కిట్లు
జ్వరం, ఇతర లక్షణాలతో ఉన్నవారికి ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్న బృందం సభ్యులు తమ వద్ద ఉన్న మెడికల్ కిట్లను అందజేస్తున్నారు. ఈ మెడికల్ కిట్లలో తిరిగి వినియోగించడానికి వీలుగా 5 మాస్కులు, 250 ఎంఎల్ శానిటైజర్, ఒక సబ్బు, రెండు జతల చేతి గ్లౌజ్లతోపాటు అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు, విటమిన్ -సీ, జింకోవిట్. డోలో 650, సిట్రిజన్, హెచ్సీ క్యూ 200 ఎంజీ ట్యాబ్లెట్లతో కూడిన కిట్ అందజేస్తున్నారు. ఈ కిట్తోపాటు 17 రోజులపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఇంటింటి సర్వేలో వారి ఫోన్ నంబర్లు కూడా తీసుకొని రోజువారీగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి ఇంటిని మానిటరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నది.
ఊరూరా జ్వర సర్వే
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గురువారం జ్వర సర్వే ప్రారంభమైంది. వైద్యారోగ్యసిబ్బంది, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టాయి. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లోని పల్లెల్లో ఎక్కడ చూసినా వైద్య సిబ్బందే కనిపించారు. పరీక్షలు చేస్తూ మందుల కిట్లు అందజేశారు.