హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): నక్క ఒకరోజు కొంగను విందుకు పిలిచింది. ఘుమఘుమలాడే సూప్ను తయారుచేసింది. రెండు పల్లాల్లో పోసుకొచ్చి ఒకదానిని కొంగ ముందుంచింది. పొడవైన ముక్కున్న కొంగ ఆ సూప్ను తాగలేకపోయింది. నక్క మాత్రం మొత్తం జుర్రేసింది. కొంగ ఆకలితో నకనకలాడింది. చిన్నప్పుడు చదువుకున్న ఈ కథను అక్షరాలా నిజం చేస్తున్నది కేంద్రప్రభుత్వం. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను హిందీ, ఇంగ్లిష్లో మాత్రమే నిర్వహిస్తూ.. హిందీయేతర రాష్ర్టాల అభ్యర్థులకు తీరని మోసం చేస్తున్నది. కేంద్రప్రభుత్వ ఏజెన్సీ ‘స్టాఫ్ సెలక్షన్ కమిషన్’ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇందుకు నిదర్శనం. కేంద్ర భద్రతాబలగాల్లో 25,271 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పరీక్ష హిందీ, ఇంగ్లిష్లో మాత్రమే ఉంటుందని అందులో పేర్కొనడం హిందీయేతర రాష్ర్టాల్లోని నిరుద్యోగులకు పిడుగుపాటుగా మారింది.
గత ఏడాదే గళమెత్తిన సీఎం కేసీఆర్
హిందీయేతర రాష్ర్టాల యువతకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే గళమెత్తారు. కేంద్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, రైల్వే, డిఫెన్స్, జాతీయబ్యాంకులు వంటివాటికి రెండు భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల హిందీయేతర రాష్ర్టాల్లోని పిల్లలకు, ఇంగ్లిష్ మీడియంలో చదువని యువతకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని గతేడాది నవంబర్ 18న ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అన్ని రాష్ర్టాలవారికి న్యాయం జరుగాలంటే ప్రాంతీయభాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని కోరారు.
అన్యాయంలో భాగస్వామి కిషన్రెడ్డి?
సీఎం కేసీఆర్ రాసిన లేఖను అప్పట్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెటకారం చేశారు. ‘ప్రధాని మోదీ ఏర్పాటుచేసిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ 12 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నది. ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియనట్టున్నది’ అంటూ ఎద్దేవా చేస్తూ నవంబర్ 20న ట్వీట్ చేశారు. మరి కిషన్రెడ్డి ఇప్పుడే సమాధానం చెపుతారని రాష్ట్ర యువత ప్రశ్నిస్తున్నది. పీఎం మోదీ నేతృత్వంలో తెలంగాణ సహా హిందీయేతర రాష్ర్టాలకు జరుగుతున్న ఈ అన్యాయంపై గొంతెత్తాలని డిమాండ్ చేస్తున్నది. లేనిపక్షంలో కోట్ల మంది యువతకు జరుగుతున్న అన్యాయంలో కిషన్రెడ్డికీ భాగం ఉన్నట్టేనని హెచ్చరిస్తున్నది. ఇప్పటికే ఈ విషయంలో నెటిజన్లు కేంద్రప్రభుత్వాన్ని, కిషన్రెడ్డిని నిలదీస్తున్నారు.