కాబూల్ : తాలిబన్ల ఆక్రమణ అనంతరం ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో సోమవారం సంభవించిన భూకంపంతో జనానికి మరింత సమస్యలు పెరిగాయి. బలమైన భూ ప్రకంపనలకు పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్లో చాలా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సోమవారం, తుర్క్మెనిస్తాన్తో సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ ప్రావిన్స్ బాద్గిస్లో రెండు వరుస భూకంపాలు సంభవించాయి.
ఇప్పటి వరకు 26 మంది మృత్యువాతపడ్డారు. పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డట్లు సమాచారం. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 5.3 తీవ్రతతో తొలుత భూకంపం సంభవించింది. మళ్లీ సాయంత్రం 4 గంటల సమయంలో 4.9 తీవ్రతతో రెండోసారి మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలతో ప్రభావితమైన గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని, మృతుల సంఖ్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఇండ్లు ధ్వంసమయ్యాయని ప్రావిన్స్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ మహ్మద్ సర్వరీ తెలిపారు. ప్రావిన్స్లోని కడిస్ జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఇంటి పైకప్పు కూలడంతో పలువురు చిక్కుకుని మరణించారని బద్గీస్ గవర్నర్ మహ్మద్ సలేహ్ తెలిపారు. చిన్నారులు, మహిళలు సహా పలువురు గాయపడ్డారని తెలిపారు. భూ ప్రకంపనల ధాటికి 700కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని మినిస్ట్రీ ఆఫ్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ హెడ్ ముల్లా జనన్ సాకే పేర్కొన్నారు.