డిజిటల్ గోల్డ్.. బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి ఉన్నవారికి ఓ చక్కని అవకాశం.
స్వచ్ఛత, నాణ్యతలతో కూడిన సురక్షిత పెట్టుబడులకు మార్గం. స్థోమతతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతివారూ పసిడిపై సౌకర్యవంతంగా మదుపు చేసుకోవచ్చు.
పేటీఎం, గూగుల్ పే వంటి ఫిన్టెక్ కంపెనీల తర్వాత ఇప్పుడు డిజిటల్ గోల్డ్ను నగల వ్యాపారులు కూడా ఆఫర్ చేస్తున్నారు. బంగారంపై సంప్రదాయ పెట్టుబడులకు భిన్నంగా వచ్చిన ఈ డిజిటల్ గోల్డ్కు క్రమేణా అన్ని వర్గాల నుంచి ఆదరణ పెరుగుతుండటం ప్రస్తుతం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
విక్రేతలెవరు?
మన దేశంలో మూడు కంపెనీలు డిజిటల్ గోల్డ్ను అమ్ముతున్నాయి. ఎంఎంటీసీ పీఏఎంపీ, ఆగ్మాంట్ గోల్డ్టెక్, డిజిటల్ గోల్డ్ ఇండియా (సేఫ్ గోల్డ్) కంపెనీలు పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే వంటి సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి డిజిటల్ గోల్డ్ను విక్రయిస్తున్నాయి. అలాగే తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా డిజిటల్ గోల్డ్ను విక్రయిస్తున్నాయి. వినియోగదారులు డిజిటల్ గోల్డ్ అకౌంట్ను నేరుగా లేదా సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర ఓపెన్ చేసుకోవచ్చు.
భౌతిక బంగారం కన్నా ఎలా మేలు?
భౌతికంగా ఉన్న బంగారాన్ని దొంగతనాల నుంచి కాపాడుకోవడం కష్టమే. బ్యాంకులో లాకర్లు అంటే అందరికీ అందుబాటులో లేవు. అలాగే ఆభరణాలైతే నాణ్యత డౌటే. డిజిటల్ గోల్డ్లో వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం కొనుగోలు చేసేది 24 క్యారెట్ల 999.9 స్వచ్ఛత బంగారం. ఇది కస్టోడియన్ వాల్ట్లో ఉంటుంది. కనుక బ్యాంక్ సేఫ్ లాకర్ అవసరం లేదు. అలాగే ఫిజికల్ గోల్డ్లో మేకింగ్ చార్జీలు అదనం. డిజిటల్ గోల్డ్కు 3 శాతం జీఎస్టీ మినహా అదనపు చార్జీలు ఏవీ లేవు. దేశంలో ఎక్కడైనా డిజిటల్ గోల్డ్కు ఒకటే ధర. ఎలాంటి ఖర్చులు లేకుండానే గోల్డ్ను డిజిటల్గానే అమ్ముకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే మీ ఇంటి దగ్గరికే డెలివరీ చేస్తారు. అంతేగాక ఫిజికల్ గోల్డ్ కన్నా అతి తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసే సదుపాయం డిజిటల్ గోల్డ్లో ఉంది.
పేపర్ గోల్డ్-డిజిటల్ గోల్డ్
గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు ఇప్పటిదాకా ఉన్న డీమ్యాట్ అకౌంట్లో ఉండే పేపర్ గోల్డ్. వీటిని కొనుగోలు చేయాలంటే లావాదేవీ చార్జీల కింద 0.5 శాతం నుంచి 1 శాతం వరకు, అలాగే వార్షిక డీమ్యాట్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కానీ డిజిటల్ గోల్డ్కు ఒకసారి 3 శాతం జీఎస్టీ చెల్లిస్తే చాలు. అలాగే వంద రూపాయలతోనూ డిజిటల్ గోల్డ్ను కొనుగోలు చేయవచ్చు. ఒక మిల్లి గ్రాము బంగారాన్ని కూడా కొనుగోలు చేయడానికి డిజిటల్ గోల్డ్ అవకాశాన్ని కల్పిస్తుంది. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కు బదిలీ కూడా చేయవచ్చు. పేపర్ గోల్డ్లో ఈ సదుపాయం లేదు.
భద్రమేనా?
డిజిటల్ గోల్డ్ను అమ్మిన సంస్థే డిజిటల్ గోల్డ్కు కస్టోడియన్గా వ్యవహరిస్తుంది. భాగస్వామి లేదా సర్వీస్ ప్రొవైడర్ నుంచి కొనుగోలు చేసినా సరే అమ్మిన సంస్థనే కస్టోడియన్. క్వాలిటీ, వాల్ట్ల నిర్వహణను పర్యవేక్షించేందుకు ట్రస్టీ ఉంటారు. మీరు కొన్న బంగారాన్ని ఎవరికీ బదిలీ చేసే అవకాశం లేదు. అయితే డిజిటల్ గోల్డ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఇప్పటివరకు అధికారిక రెగ్యులేటరీ సంస్థ అంటూ లేదు. అందుకని కొంత రిస్క్ ఉన్నది. త్వరలోనే సెబీ ఇం దుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయనున్నది.
డిజిటల్ గోల్డ్ అంటే
బంగారాన్ని డిజిటల్గా కొనుగోలు చేసే వెసులుబాటును ఈ సదుపాయం కల్పిస్తుంది. కొనుగోలు చేసిన బంగారాన్ని వాల్ట్ల్లో దాన్ని అమ్మిన సంస్థే భద్రపరుస్తుంది. బంగారం కొనుగోలు చేసిన వెంటనే ఇన్వాయిస్ చేతికిస్తారు. కొనుగోలు చేసిన బంగారం పరిమాణం విలువ ఉంటుంది. అంతకు ముందే డిజిటల్ గోల్డ్ను కొనుగోలు చేసినట్టయితే, కొత్తగా కొనుగోలు చేసిన బంగారంతో సహా మొత్తం బంగారం పరిమాణం ఇన్వాయిస్లో చూపిస్తారు. ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని ఏరోజైనా సరే లైవ్ మార్కెట్ ధరకు అమ్మే వీలుంటుంది. అలాగే అవసరమనుకున్నప్పుడు డిజిటల్ బంగారాన్ని కాయిన్స్ లేదా ఆభరణాల రూపంలో తీసుకోవచ్చు. నగలైతే, మేకింగ్, ప్యాకేజింగ్ చార్జీలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. కానీ ఒకే రోజులో రూ.2 లక్షలకు మించరాదు.